I కోరింథీ-61 15:5-8 July 24, 2023
ప్రభువు పునరుధ్ధానo సువార్తను స్థిరపరిచింది
ప్రతి ఒక్కరికి, ఒక్కొక్కరికి పరమ రక్షకుడు యేసు నామములో శుభములు! రేడియో ద్వారా మీరు వింటున్న బైబిల్ అధ్యయనాలు మీ ఆత్మీయ జీవితానికి ఎలా తోడ్పడుతున్నాయో మాకు తెలియచేయండి. వివరంగా తెలియచేయడం మంచిది. “బాగుంది” “చాలా బాగుంది” ఈలాంటి స్పందనకన్నా, మీ వ్యక్తిగత జీవితానికి ఏ విషయములో ఎప్పుడు ఎలా సహాయపడిందో స్పష్టంగా పంచుకోవడం మంచిది. ఉత్తరం రాయాలని ఆశిస్తే మీరు అడ్రస్ అడిగినట్లయితే పంపిస్తాము. ప్రార్థన: ఈ నాటి మన అంశం: ప్రభువు పునరుధ్ధానo సువార్తను స్థిరపరుస్తుంది. లేఖన భాగం I కొరింధీ 15:5-8. “5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. 6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. 7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను. 8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;”
'చూస్తే కానీ నమ్మవద్దు, నమ్మలేము' అనే ఒక సామెత మన మధ్యలో ఉన్నది. ఒక ప్రమాదం జరిగినపుడు దాన్ని కళ్ళారా చూచిన వారి సాక్ష్యం కోసం చూస్తాము. ఇక్కడ పౌలు పునరుధ్ధానుడైన ప్రభువును కళ్ళారా చూచిన సాక్షులను చూపిస్తున్నాడు. మొదటిగా పేతురు. ఆయనను పౌలు కేఫా అని పిలుస్తున్నాడు. అది ఆయన అరమెయిక్ భాషలోని పేరు. పేతురూ, నీవు అప్పుడు ఉన్నవా, చూశావా? అవును, నేనున్నాను, నేను చూశాను. ఆయన నాతో మాట్లాడాడు. ఆతరువాత 12గురు శిష్యులను పిలుస్తున్నాడు. యేసు ప్రభువు అకస్మాత్తుగా శిష్యులున్న తలుపులు వేసి ఉన్న గదిలోనికి వచ్చి, వారికి తన చేతులలోని గాయములు, పక్కలోని గాయములు చూపించాడు. వారిలో ఏ ఒక్కరినైనా, నీవక్కడ ఉన్నవా అని అడిగితే అవును నేనున్నాను, నేను ప్రభువును చూశాను, ఆయనతో మాట్లాడాను అని వారు సాక్ష్యమిస్తారు. ఆ తరువాత ఒకే సారి 500 మంది ఉన్న సమయములో ప్రభువు వారికి కనపడ్డాడు. వారిలో ఎక్కువమంది అప్పటికి ఇంకా బ్రదికి ఉన్నారని పౌలు తేటపరుస్తున్నాడు. వారిని అడగండి, వారితో మాట్లాడండి. వారు సాక్ష్యమిస్తారని పౌలు రుజువులు చూపిస్తున్నాడు. మీరు వారితో మాట్లాడితే వారేమంటారు? ప్రభువు వచ్చినపుడు మీరున్నారా? అవును మేమున్నాము. మీరు ప్రభువును చూచారా? అవును మేము చూచాము. ఆ తరువాత యాకోబు, యేసు క్రీస్తు ప్రభువు సహోదరుడున్నాడు. యేసు క్రీస్తు ప్రభువునకు దేవుడు తండ్రి. యాకోబునకు యోసేపు తండ్రి. ఈయన మొదటినుండి అనుమానిస్తున్నాడు. ఆయన ఏ మాత్రం నమ్మలేదు. ఆయన ప్రభువుతో కలిసి పెరిగాడు. తన స్వంత సహోదరుడు ఎలా ప్రత్యేకమైనవాడౌతాడు? కాని ప్రభువు మరణం, పునరుధానం తరువాత, ఆయన ధృడంగా గట్టిగా నమ్మాడు. ఆయనను అడగండి, ఆయన తన సాక్ష్యం చెప్పగలడు. ఇక చివరలో తార్సు వాడైన పౌలు ఉన్నాడు. ఆయనను అడగండి, తన స్వంత సాక్ష్యం పౌలు చెప్పగలడు. అకాలములో పుట్టినట్టున్న తాను దమస్కుకు వెళుతున్న సమయములో ప్రభువును తాను చూచానని పౌలు చెబుతున్నాడు. సౌలు యేసు ప్రభువు శిష్యుల మీద ద్వేషపు ఆవేశముతో ప్రధాన యాజకుని దగ్గర వారిని బంధించడానికి ఆజ్ఞలు చేతబట్టుకొని వారిని యెరూషలేమునకు తీసుకు రావడానికి వెళుతున్నాడు. వారికి మరణ శిక్ష పడేలా చూసి దాన్ని తాను అజమాయిషీ చేయడానికి కావచ్చు. కాని అప్పుడు యేసు ప్రభువు సౌలును ఎదుర్కున్నాడు, కాబట్టి పౌలు నేను ప్రభువును చూచాను అని సాక్షం చెప్పగలడు. దేవుని మహిమ ఆయనను క్రింద పడేయడం అపో. పౌలు ఎన్నడూ మరువలేదు. అదెలా సాధ్యం? ప్రభువునకు శత్రువుగా ఘోరమైన హత్యాకాండ, హింస, ద్వేషభావముతో నిండిన వ్యక్తితో ప్రభువే స్వయంగా “నీ వెందుకు నన్ను హింసిస్తున్నావు?” అని మాట్లాడడం స్పష్టంగా విన్నాడు. పౌలు తనకుతాను సమయముమించి జన్మించిన వానివలె ఫీలవుతున్నాడు. గమనించండి, శ్రోతలూ, యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి సజీవుడైనట్టు ఎవ్వరూ చేయలేదు. ఆయనలాగా ఒక కన్యకు మానవప్రమేయం లేకుండా ఎవ్వరూ జన్మించలేదు. ప్రభువు వలె పాపము మలినము లేకుండా, పాపము చేయకుండా జన్మించినవారు లేరు. ప్రభువు లాగా మరణించినవారు ఎవ్వరూ లేరు. ఆయనను ఎవరూ చంపలేదు, ఆయనే తన ప్రాణమును లేదా ఆత్మను అప్పగించాడు. ఆయనలాంటి వారెవ్వరూ లేరు. ఆయన ఏకైక దేవుని కుమారుడు. పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఈ సత్యాన్ని అనేకమార్లు తేటపరుస్తుంది. ఉదాహరణకు, యోహాను సువార్త 3:16 జాగ్రతగా అలకించండి: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” ఆయనలాంటి వారెవ్వరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. కేవలము కావాలని ఆయనను తిరస్కరించాలని, సత్యమును నమ్మకూడదని నిర్ణయించుకున్నవారే ఇంత స్పష్టంగా వ్రాయబడిన చరిత్రను నమ్మరు. సాక్ష్యాధారాలను, ప్రభువు మరణమును జయించి సజీవుడై తిరిగి లేచిన తరువాత ఆయనను చూచి, ఆయనతో మాట్లాడిన వారి సాక్ష్యమును, పౌలు స్పష్టంగా చూపించాడు. అదేదో మాయాజాలము, కనికట్టు కాదు. వారు ఆయనను ముట్టుకున్నారు. ఆయనతో మాట్లాడారు. ఆయన కాళ్ళు చేతులను చూచారు. చీలల గురుతులను కూడా చూచారు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయములోని మొదటి మూడు వచనాలలో, అపోస్తలుడు యోహాను ఇలా వ్రాశాడు: “1. జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.2. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.3. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.”
యేసు క్రీస్తు ప్రభువు వారి అద్వితీయత, సాటిలేనితనము, ప్రత్యేకత ఆయన పునరుధ్ధానమును స్థిరపరుస్తుంది. మీరింకా యేసు ప్రభువు మరణమును జయించి సజీవుడై ఉన్న దేవుని కుమారుడని నమ్మ లేదా? ఈ సాక్షాధారాలను నమ్మండి. ప్రభువుతో బాటు నిత్య జీవములో, పరలోకములో నిత్య రాజ్యములో నిరంతరం ఆయనతో జీవించడానికి మీరు కృప పొందే అవకాశం ఇప్పుడు ఉన్నది.
యేసు క్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా నమ్మి విశ్వసించిన వారైనా, మన సమస్యలు, బాధలు, వేదనలు, మనలను క్రుంగ దీస్తూ ఉంటాయి. పాపమును, లోకమును, శరీరమును, మరణములు జయించి, తిరిగి లేచి సజీవుడై యున్న ప్రభువు ప్రస్తుతం తండ్రి కుడి ప్రక్కలో సింహసనాసీనుడై, మీ పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 8: 34 “శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే”! హల్లెలూయ! యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ బాధలలో, శోధనలలో స్థిరంగా విశ్వాసముతో నిలిచి ఉండాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీవు ధైర్యం చెడకూడదని నీ కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనమంతా ఆత్మ ఫలము ఫలించాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సత్యము మనలను పట్టుదలతో, విశ్వాసంతో, ధైర్యముతో నింపుతుంది.
ప్రార్థన: మీ స్వంత మాటల్లో మీ హృదయపు ప్రేరణనుబట్టి ప్రార్ధన చేసుకునండి.
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment