I కొరింథీ-69 15:45-50
పునరుధ్ధానములో మహిమతో ప్రకాశిస్తున్న ఒప్పుకోలు
శ్రోతలందరికీ శుభములు వందనాలు! క్షేమంగా ఉన్నారా? పునరుధ్ధానమును గూర్చిన నిరీక్షణ, అవగాహన ప్రతి
ఒక్కరికీ అవసరం. ఏ ఒక్కరు పునరుధ్ధానo తప్పించుకోలేరు. ఈ భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుని తీర్పు
తప్పదు. ప్రసంగి గ్రంధం 12వ అధ్యాయము చివరి వచనం. “గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు
విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.” ఎంత రహస్యంగా
చేసినా, అది మంచిదైనా, చెడ్డదైనా, అన్నీ తీర్పు క్రిందికి రావలసిందే! తప్పదు. క్రొత్త నిబంధనలో కూడా ఈ సత్యము
తేటగా రాయబడింది. హెబ్రీ పత్రిక 9:27 “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత
తీర్పు జరుగును” చివరి గ్రంధం ప్రకటనలో తీర్పు గురించి విస్తృతంగా బోధించే ఆ గ్రంధములో కూడా చాలా లోతైన
సంగతులు తీర్పు గురించి రాయబడ్డాయి. ప్రియ స్నేహితుడా, సోదరీ, మీరెప్పుడైనా ఈ విషయం ఆలోచించారా?
దేవుని మహా ఉగ్రత, తీర్పు తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఆయన ఏర్పాటు చేసిన విమోచన మార్గం యేసు క్రీస్తు
ప్రభువు అమూల్యమైన పరిశుద్ధ రక్తమే! ఈ సమయములోనైనా, ఇప్పుడే, నీవు హృదయపూర్వకంగా ఆయనను
సమీపించి క్షమాపణ కోరితే ప్రభువు నిన్ను తీర్పునుండి తప్పించి తన నిత్యమైన పరలోకపు రాజ్యములో
చేర్చుకుంటాడు. ప్రార్థన:
I కొరింథీ 15వ అధ్యాయమును క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాము. వచనం వెoబడి వచనం. మీరు మళ్ళీ మళ్ళీ
ఆ అధ్యయనాలు వినాలనుకున్నా చదవాలనుకున్నా మా వెబ్ సైట్లో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. దాని
వివరాలు కావాలని కోరెవారు ఫోన్ చేసి తెలుసుకొనండి. ఈ పూట 15వ అధ్యాయము 45-50 వచనాలు అధ్యయనం
చేద్దాం. ఈ భాగములో అధ్యయనము చేసే అంశము, ఆహ్లాదభరితమైన ఒప్పుకోలు. ముందుగా పరిశుద్ధ లేఖన
భాగమును చదువుకుందాం.
“45
ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు
జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి
ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
46 ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
47 మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు
పరలోకమునుండి
వచ్చినవాడు.
48 మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే,
పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.
49 మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము
పరలోకసంబంధిపోలికయు ధరింతుము.
50 సహోదరులారా, నేను చెప్పునది
ఏమనగా రక్తమాంస ములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను
స్వతంత్రించుకొనదు.
ఈ భాగములో మొదటి మానవుడు ఆదామును, రెండవ ఆదాము యేసు క్రీస్తును పోల్చుతూ ఉన్నాము.
ఆదాము స్వాభావికమైనవాడు. నేల మoటితో దేవుడు ఆదామును సృష్టించాడు. అందుకే ఆయనను నరుడు అన్నారు.
దేవుడు ఆయన నాసికరంధ్రములలో తన ఊపిరిని ఉదినప్పుడు ఆయన జీవాత్మ ఆయాడు. ఆది. 2:7. రెండవ లేదా
చివరి ఆదాము ఆత్మీయమైనవాడు. పునరుధ్ధానమును బట్టి ఆయన పరలోకమునుండి వచ్చిన ప్రభువు. సరిగ్గా
చెప్పాలంటే, ఆయన మానవ శరీరము ధరించకముందు కూడా, పరలోకములో ఉన్న మహా దేవుడు, ప్రభువు. కాని
మనకోసం శరీరమును ధరించాడు.
భూసంభంధమైన మనము అనివార్యముగా ఉన్నాము. మనము మట్టికి చెందినవారమే! మట్టికి చెందిన
మనము భూమికి చెందినవారమే! అదే విధంగా పరలోకమునకు చెందినవారు అలాగే ఉంటారు. వారు
పరలోకపువారుగానే ఉంటారు. ఆ తరువాత అపో. పౌలు భూమికి చెందిన రూపము మనకున్నట్ట్లే, మనకు
పరలోకమునకు చెందిన రూపమును పొందుతాము. పౌలు ఈ సమయములో క్రైస్తవులతో, అనగా విశ్వాసముకలిగిన
వారితో మాట్లాడుతున్నాడు. కాని పునరుధ్ధానము అందరికీ కలుగుతుంది, అనగా అందరు తిరిగిలేస్తారు.
దుష్టత్వములో, పాపములో జీవించిన వారు కూడా తిరిగి లేస్తారు. రెండు పునరుధ్ధానాలు ఉంటాయని యేసు క్రీస్తు
ప్రభువు తేటగా చెప్పారు. నీతిమంతుల పునరుధ్ధానము, దుష్టుల పునరుధ్ధానము. ఆదాము నుండి జన్మించిన ప్రతి
ఒక్కరు, అనగా మానవజన్మనెత్తిన ప్రతి ఒక్కరు, మరణించక తప్పదు. యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానుడైనందు చేత
మరణించిన ప్రతి ఒక్కరు తిరిగి జీవముతో లేస్తారు. మట్టిలో మనము భాగస్తులమై జన్మించినట్టే, పరలోకపు వాటిలో
కూడా భాగము మనము పొందుతాము. 50వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా! “సహోదరులారా, నేను
చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను
స్వతంత్రించుకొనదు.” దేవుని రాజ్యములో చేరకముందు మార్పు జరగాలి. దేవుని రాజ్యము
ఎలా వస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఒకసారి యెరూషలేమునకు దగ్గరలో ప్రభువు ఉన్నపుడు ఒక
ఉపమానము చెప్పారు. లూకా సువార్త 19:12లో అది రాయబడింది. “రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని
మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణ”మయ్యాడు. ఇది స్పష్టంగా యేసు ప్రభువును సూచిస్తుంది. ఆయనే
పరలోకమునుండి భూమి మీదికి వచ్చి కల్వరి కొండ సిలువమీద తన ప్రాణమునర్పించి, మరణించి పునరుధ్ధానుడై
తిరిగి లేచి తన రాజ్యమును పొందడానికి పరలోకపు మహిమలోనికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి తన రాజ్యమును
తాను తీసుకొని స్థాపిస్తాడు. కాబట్టి మనమెవరమైనా, రాజ్యము కట్టడము లేదు. ఆయనే తన రాజ్యమును
కడుతున్నాడు. దేవుని రాజ్యమంటే అందరి అవసరాలు తీర్చబడి, అందరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడమని ఎందరో
అనుకున్నారు. అది దేవుని రాజ్యము కాదు, అది ఎన్నటికి జరగదు.
గమనించండి శ్రోతలూ, మన ప్రభువు ప్రభువు నేర్పిన ప్రార్ధనలో “నీ రాజ్యము వచ్చును గాక” అని నేర్పించాడు.
అనగా రాజు వచ్చినపుడు వస్తుంది. ప్రకటన గ్రంధములో మనకేమి బోధించ బడుతున్నది? ప్రకటన 11:15
గమనించండి. “ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను;…. ” ఒకానొక
సమయములో ఈ మాటలు ఈ భూమ్మీద మారు మోగుతాయి. హల్లెలూయ! అవును, మన ఈ శరీరముతో దేవుని
రాజ్యములో చేరలేము. రక్త మాంసములు అంటే అర్ధం అదే! శరీరముతో జీవించే మనము ఈ శరీరముతో దేవుని
రాజ్యములో చేరలేము. కాబట్టి, ప్రియ సోదరీ, సోదరులారా, పునరుధ్ధానమనే ఈ అద్భుతమైన సత్యమును గూర్చి
మనం సంతోషముతో గంతులు వేయవచ్చు! ఉత్సాహముతో పులకించవచ్చు. పునరుధ్ధానమే లేకపోతే మన ఈ మంటి,
కుళ్లిపోయే శరీరముతో ఎంత దుర్భరంగా జీవించేవారమో ఒక్క సారి ఊహించుకోండి! కాని మన రక్షకుడు, ప్రియుడు,
దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు పునరుధ్ధానము వలన మనకెంత నిరీక్షణ ఉందో గమనిస్తున్నారా? మీ చుట్టూ
ఉన్న మొక్కలు విత్తనాలు మీరు చూసినప్పుడల్లా ఈ సత్యము మీకు గుర్తుకు వస్తుందని ఆశిస్తున్నాము. విత్తనము
ఎంత ఖచ్చితంగా మొలకెత్తి మొలకగా మొలిచి ఆ తరువాత క్రమేపి వృక్షంగా మారుతుందో, అదే విధంగా ఈ ఆ శరీరం
ప్రభువు నందు క్రమ శిక్షణతో జీవిస్తే మన శరీరము కూడా మహిమా శరీరముగా మారడం ఖచ్చితం. లౌకిక
మలినమునకు దూరంగా పవిత్రంగా ఉంచి, ఈ శరీరమును ప్రభువు చిత్తమునకు సమర్పించితే పునరుధ్ధానంలో గొప్ప
మహిమ కలుగుతుంది. దేవుని పరిశుద్ధవాక్యమునకు లోబడి ఉండి, విధేయతతో జీవిస్తే అనుదినము పరిశుద్ధ
పరచబడతాము. ఈలాంటి వింతైన సంగతులు మనకు ప్రభువు ఏర్పాటు చేయడం ఎంత గొప్ప విషయం కదూ! కాని
విలువ చెల్లించనిది ఇది జరగదు. ఏమిటా విలువ? విధేయత, సమర్పణ, శ్రమలు సహించడo, సిలువను మోయడం.
సోదరీ సోదరులారా, పునరుధ్ధానములో పొందబోయే మహోన్నత దీవెనలను పొందాలంటే ఇది తప్ప వేరే మార్గము
లేదు.
ఇక వారి శరీరమును సైతానునకు బానిసగా అమ్ముకున్న వారి సంగతేమిటి? ఓ, సత్యము చెప్పక తప్పదు.
సైతానును సమూలంగా నాశనం చేసే సమయములో యేసు ప్రభువు మిమ్మల్ని నిత్య నరకానికి అప్పగించక తప్పదు.
అంత్య దినములలో ప్ర్లభువు ప్రస్తుతమున్న దుష్ట శక్తులను దురాత్మలనే కాక, ఇంతవరకు బంధించబడిన ఇంకా మహా
ఘూరమైన దురాత్మలను, దుష్ట శక్తులను అప్పుడు లోకములో పని చేయడానికి అనుమతిస్తాడు. దాన్ని పరిశుద్ధ
గ్రంధ మహా శ్రమలకాలం అని పిలుస్తుంది. అది తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నీ పాపమంతటిని పరమ
పరిశుద్ధుడు యేసు రక్షకుని వద్ద ఒప్పుకొని ఆయన క్షమాపణ, విడుదల కోరితే, నిత్య జీవితం నీదే! ప్రార్థన:
No comments:
Post a Comment