I కోరింథీ-52 14:7-9
ప్రవచనానికి పోటి
ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువు మహా శక్తిగల నామములో వందనములు, శుభములు! ఆనందంగా ఉన్నారా? క్షణికమైన సంతోషం వస్తువులమీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, గాని, ఆనందం
దేవుని మాట మీద, ఆయనతో మన సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. I కొరింథీ పత్రిక వ్రాసిన ఆపో.
పౌలు కిరాతకమైన రోమా జైల్లో సువార్త కోసం బంధించబడి, హింసించబడుతూ ఉండికూడా తాను
ఆనందిస్తూ మనలను “ప్రభువు నందు” ఆనందించమని హెచ్చరించాడు.
ఈ నాటి ధ్యానాంశం: ప్రవచనమునకున్న పోటీ. లేఖన భాగము I కొరింథీ 14:7-9
7. పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును? 8. మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? 9. ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.
అపో. పౌలు ఒక సాధారణమైన సంగతి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఆసక్తికరమైనది. పిల్లనగ్రోవి,
వీణ జీవములేని వస్తువులైనప్పటికి, వాటిద్వారా, కొన్ని సత్యములు నేర్చుకోవచ్చు. వాటి యొక్క
స్వరము వింటే తప్ప అవి ఏమిటో మనకు అర్ధం కాదు. వాటిలో వేరు వేరు విధమైన స్వరములు
ఉంటాయి. హెచ్చు, తగ్గులైన స్వరములకు దేని అర్ధం దానికి ఉంటుంది. వాటిని ఊదినపుడు, లేదా
మీటినపుడు, వాటినుండి స్వరము బయటికి వస్తేనే మనకది ఏదో, ఏ వాయిద్యములోనుండి వచ్చిన
స్వరమో అర్థమవుతుంది. ఎన్నో సార్లు చిన్నపిల్లలు వాయిద్యముల వద్ద కూర్చొని వారి వేళ్ళతో
ఇష్టమువచ్చినట్టు మీటడం చూసే ఉంటాము. అప్పుడు మనకేమైనా అర్ధమవుతుందా? ఏ పాట
వాయిస్తున్నారో అర్ధమవుతుందా? ఒక శృతి, లయ, శ్రావ్యత, మాధుర్యం వాటి వల్ల మనకు అర్ధం
కాదుకదా?
అపొ. పౌలు ఇంకా ఏమని బోధిస్తున్నాడు? బూరధ్వని వినే వాళ్ళను యుద్ధానికి సిద్ధం కమ్మని
చెబుతుంది. కాని బూర ఊదినపుడు దానిలోనుండి స్పష్టంగా బూరధ్వని బయటికి వినపడకపోతే,
యుద్ధానికి ఎవ్వరూ సిద్ధపడరు. బైబిల్ దినాలలో బూరలు యుద్ధానికి ప్రజలను సిద్ధం చేయడానికి
వాడేవారు. అవి పొట్టేలు కొమ్ములతో చేయబడేవి. ఈ బలమైన పొట్టేలు బూరలు సబ్బాతు దినపు
ఆరంభములో, పౌర్ణమి సమయాల్లోనూ యూదులు ఊదేవారు. పండుగ సమయాల్లో వాటిని ఊదేవారు.
వినే ప్రజలకు ఏ నాదమునకు ఏమి అర్ధమో తెలిసి ఉండేది. దానికి సరిగ్గా వారు స్పందించేవారు. ఇక దీని
అర్ధం మనకు స్పష్టంగా అర్ధం కావాలంటే, ఇశ్రాయేలీయుల న్యాయిధిపతి గిద్యోను విషయం తెలుసుకోవాలి.
న్యాయా. 7:19-22 గమనించండి.
“19. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న
నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను
పగులగొట్టిరి.
20. అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి,
యెడమచేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము
గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.
21. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.
22. ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. “
గమనించారా? వారు ఊదిన బూరల ధ్వని ఎవ్వరికి అర్ధం కాని ధ్వని కాదు. విన్న ప్రతి ఒక్కరూ అర్ధం
చేసుకొని దాని అర్ధం ప్రకారం క్రియ చేశారు. బూర ధ్వని ఆ క్రియ చేయించకపోతే ఎంత ఘోరమైన
సంగతి! కాస్త ఆలోచించండి.
ప్రవచనమునకు మరొక పోటీ అందరికి సులభంగా అర్థమయ్యే భాష, మాటలు. ఆపో. మాటలలో
తెలుసుకుందాం. 9వ వచనం. “ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది
ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు.” సూటిగా సులభంగా అర్థమయ్యే
భాషలో కొన్ని మాటల్లోనే అంతా చెప్పేయండి. మరో మాటలో చెప్పాలంటే, సాగతీసినట్టుగా, చెప్పిందే,
మళ్ళీ, మళ్ళీ చెబుతూ విసిగించకూడదు. వినేవారికి వినసొంపుగా, అర్థమయ్యే భాషలో స్పష్టంగా
బోధించండి. మనము చెప్పేది ఎవ్వరూ అర్ధం చేసుకోకపోతే, అంతా వ్యర్ధమే అవుతుంది. అప్పుడు
చెప్పిందంతా పనికిరానిదవుతుంది. అలాంటి మాటలు, లేక బోధ, ఒక వ్యక్తి గాలిలో మాటలాడినట్టే
అవుతుంది. మీరు అడవిలోకి పోయి మీ శక్తికొలది బిగ్గరగా మాట్లాడండి, ప్రయోజనమేమిటి?
నిష్ప్రయోజనమే! ఎందుకు? మీ మాటలు విని స్పందించడానికి ఎవరూ లేరు. కాబట్టి శ్రోతలూ,
గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ప్రవచనం, లేదా లేఖన బోధన వినే వారికి అర్ధమయ్యి వారు
స్పందించి, వారి హృదయాల్లో, జీవితాల్లో మార్పు కలిగించినపుడు అది నిజమైన ప్రవచనం అవుతుంది.
లేఖనముల్లో నుండి బోధన, సవరణ, హెచ్చరిక, ఆదరణ, ఊరడింపు చేసినపుడు వాటి ద్వారా, వినే
వారికి మేలు, హెచ్చరిక, ఓదార్పు, ఊరట
కలుగుతుంది. మనము చెప్పే ఏ మాటలైనా, బోధ అయినా, వినే వారికి నిన్ను ముడివేయకపోతే అంతా
శూన్యమే, నిష్ప్రయోజనమే! బోధన ద్వారా, వినేవారికి మీకు సంబంధం ఏర్పడుతుంది. అది జరగడం
లేదంటే పడిన ప్రయాస అంతా వ్యర్ధమే! అందుకే పదే పదే రేడియోలో చెబుతూ ఉంటాము. మీరు పొందిన
మేళ్ళు, దీవెనలు, ఏదో ఒక రీతిగా మాతో పంచుకోండి అంటూ మిమ్ములనందరినీ అడుగుతూ ఉంటాము.
కొందరు చెబుతూ ఉన్నారు, కానీ వివరంగా చెప్పాలి. యధార్ధంగా మాట్లాడాలి. ఎల్లప్పుడూ మెళ్ళు,
దీవెనలు, ఆశీర్వాదాలే కాదు, కొన్ని సార్లు గద్దింపు కలిగించవచ్చు. తప్పును, పాపమును సరిదిద్దే
హెచ్చరికలు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ లేఖనముల ద్వారా మీకు కలిగించవచ్చు. వ్యక్తిగత పాపమును
గూర్చి గద్దించవచ్చు. ఏమి సంకోచించకుండా పంచుకొనండి. అనేక భక్తుల వ్యకిగత పాపములు, ఓటమి,
పడిపోయిన సంఘటనలు, పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడేలేదా? మనము మన పాపములను,
ఓటమిని ఎందుకు దాచుకోవాలి. యాకోబు పత్రిక 5:16 గమనించండి. “మీ పాపములను ఒకనితోనొకడు
ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన
మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.” పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఈ ఆజ్ఞ ప్రార్థన
సందర్భములో ఇవ్వడ గమనార్హం. అనగా మన పాపములు అన్నింటినీ ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని
క్షమించబడి, కడుగబడినపుడు మన ప్రార్ధనలకు సరియైన సమాధానం ఇవ్వబడుతుంది. పాపము,
అపరాధము ఇతరుల విషయములో చేయబడినదైతే, వారితో కూడా వాటిని ఒప్పుకొని సంబంధములు
సరిచేసుకున్నపుడు ప్రార్ధనలకు జవాబు దొరుకుతుంది. అంతే కాకుండా, ఇక్కడ రేడియోలో కానీ,
మరెక్కడైనా, దేవుని పరిశుద్ధ లేఖనముల బోధన ద్వారా, ప్రభువు మన పాపములను ఒప్పించినపుడు
ఏ విధంగా వాటినుండి క్షమాపణ విడుదల పొందామో, తోటి విశ్వాసులతో, మీకు వాక్య బోధన, లేదా
ప్రవచనం చెప్పిన వారితో పంచుకోవడం ద్వారా దేవుని వాక్యమునకు మనము విధేయత చూపించినట్టు.
గమనించారా, శ్రోతలూ? దేవుని వాక్య బోధన, లేదా ప్రవచనమని చెప్పబడుతున్న మన బైబిల్ రేడియో
అధ్యయనాల ద్వారా మీరు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నది, అనగా మీ జీవితం, ప్రవర్తన,
ఆలోచనలు, నిర్ణయాలు మారుతున్నది మీలోనో దాచుకుంటే, అవి ఇతరులకు తెలిసే మార్గమేది? ఈ
నాటి మన బైబిల్ అధ్యయనం, మునుపటి అధ్యయనాలద్వారా, పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని దేవుని
మాటలలో, ఏ మాట చేత దేవుడు మీతో, అనగా, వ్యక్తిగతముగా వ్యక్తిగతమైన విషయంలో
పరిశుద్ధాత్ముడు మిమ్ములను ఒప్పించాడో ఆ విషయం క్షుణ్ణంగా వివరంగా దాచుకోకుండా పంచుకోవడం
వల్ల మీరు దేవునికి ఎoతో మహిమ కలిగిస్తున్నారు. 9వ వచనం జాగ్రత్తగా గమనించండి, underline,
చేసుకొనండి. “మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును?”
“స్పష్టమైన మాటలు” అని పరిశుద్ధ గ్రంధం నొక్కి చెబుతుంది. “వాక్యం చాలబాగుంది” లేదా “ఈ మాటలు
నాకోసమే అనిపించింది” ఎంత సంతోషించానంటే, ఏమి చెప్పలేను” ఇవి స్పష్టమైన మాటల లెక్క
లోనికిరావు. సమరయ స్త్రీ చెప్పిన మాటలు గమనించండి: “మీరు వచ్చి నేను చేసిన వన్నియు నాతో
చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తు కాడా?” యోహాను 4:29. అనగా తన పాపమును ఏతి
చూపించాడని ఆమె సాక్ష్యమిస్తున్నది. ఇంత తగ్గింపు, దీనమనసు మీకుందా? లేనట్లయితే ఇప్పుడే
ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా దీని విషయమే ప్రార్థన చేయండి. ప్రభువు మీకు సహాయము చేసి, ధైర్యం,
దీనమనసు ఇవ్వటానికి ఆయన శక్తిమంతుడే. ఆయన చెప్పినట్టు చేయడానికి మీరు సిద్ధమా? అంతటి
దీనమనసు, తగ్గింపు, ప్రభువే స్వయంగా మనకందరికి అంగ్రహించుగాక!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment