I కోరింథీ-38 11:17-34
క్షేమంగా ఉన్నారా? ఇబ్బందులు, ఇరుకులు, ఆందోళనలు, భయములు, మిమ్మల్ని
క్రుంగదీస్తున్నాయా? అనారోగ్యము ఆవరించి విడువకుండా ఉందా? కారణమేమిటో అని
ఎప్పుడైనా ఆలోచించారా? సహాయం చేసి విడిపించమని బాగుచేయమని ప్రార్థించడమే కాదు,
‘ప్రభువా, ఇది ఎందుకు అనుమతించావయ్యా?’ ఏదైనా పాపము, అవిధేయత, తిరుగుబాటు చేసి
నిన్ను ఆయాసపెట్టానా?' అని ఎప్పుడైనా ప్రార్ధించారా? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా
ప్రభువు సన్నిధిలో కనిపెట్టి వెతికి, దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్ముని సహాయముతో మీరే
దానికి కారణం స్వయంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రభువు బల్లలో అపవిత్రంగా
పాలుపొందినందుకు ప్రభువు అనుమతించాడేమో! లేదా మరేదైనా పాపము కావచ్చు. మీకు,
దేవునితో అలాంటి సంబంధం ఉందా? ఇతరులను అడగనవసరం లేదు. దేవుడు
మాట్లాడే దేవుడు. ప్రార్ధించుకుందాం. ప్రార్థన:
ప్రభువు బల్లను పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుని వాక్యము ఇస్తున్న మార్గ దర్శకాలు
అధ్యయనం చేస్తున్నాము. ఇది రెండవ భాగము. లేఖన భాగం: I కోరింథీ 11:17-34 మొదటి
మార్గదర్శకం అక్రమకారులను దండించండి. ఇది సంఘ పెద్దలు, సంఘకాపరులపని. మీరు
కూడా లేక్ఖ అప్పగించవలసి ఉంటుంది. దేవుని సంఘములోని పరిశుద్ధతను కాపాడుతున్నామా?
లేదా? మనుష్యుల ముఖములకు భయపడకూడదు, దేవునికి, ఆయన వాక్యమునకు భయపడాలి.
దేవుని తీర్పునైనా ఎదుర్కోవాలి, మెప్పునైనా ఎదుర్కోవాలి. మీరు దేన్ని ఎదుర్కోవాలని ఆశ
పడుతున్నారు? తీర్పు చేసేటపుడు ప్రభువు కరుణచూపడు. దేవుని వాక్యాధారంగా ఈ మాటలు
చెబుతున్నాను. సువార్తలు చదవండి, ప్రభువు చెప్పిన ఉపమానాలు జాగ్రతగా చదవండి. సమస్య
ఏమిటో తెలుసా? చదివేది మనకు కాదు, ప్రక్కవాళ్ళకు, అనుకుంటాం. దేవుని వాక్యము అద్దమని
మరచిపోకండి. చూపించేది, నిన్ను, నన్నే! అవును, శ్రోతలూ, తీర్పు సమయములో కనికరము,
దయ జాలి ఉండవు. సత్యము, దేవుని మాట ప్రకారమే ఆయన తీర్పులు ఉంటాయి.
ఇక రెండవ మార్గ దర్శకమును అధ్యయనం చేద్దాం,
ప్రభువు మరణమును జ్ఞాపకం పెట్టుకొనండి, గుర్తు చేసుకొనండి. I కోరింథీ 11:23-27.
23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి
24. దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
25. ఆ
ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ
పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన;
మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను
జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
26. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల
ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచు
రించుదురు.
27. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.
ఇక్కడ మనము అసలు విషయానికి వస్తున్నాము. జాగ్రత్తగా వహించాలి సుమా! పౌలు తాను
బోధిస్తున్నది, ప్రత్యక్షంగా యేసు ప్రభువు వద్దనుండి పొందానని అతిస్పష్టంగా బోధిస్తున్నాడు.
పౌలు మాటలు స్వయంగా ఎలా ఉన్నాయో, గమనించండి: “నేను మీకు అప్పగించిన దానిని
ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను
ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి” దీని అర్ధం ఏమిటంటే, ఆపో. పౌలు యేసు క్రీస్తు
ప్రభువుతో మాట్లాడాడు. మరెవరో చెబితే విన్న మాటలు కాదు. ఇతర అపోస్తలులు ఆయనకు
బోధించలేదు, చెప్పనూ లేదు.
మనకు తెలిసినంతవరకు పౌలు యేసు క్రీస్తు ప్రభువుతో దమస్కుకు వెళ్ళే మార్గములో
ఎదురుపడ్డాడు. దమస్కు తరువాత ఆయన అరేబియాలో మూడేళ్లు గడిపానని గలతీ పత్రిక
మొదటి అధ్యాయములో చెప్పాడు. ఒకవేళ అక్కడ పౌలు ప్రభువుతో సహవాసము చేసి
ఉండవచ్చు. తన అపోస్తలత్వము మానవుల వల్ల కలగలేదని గలతీ 1:1లో తేటపరిచాడు.
ప్రత్యక్షంగా దర్శనం కలిగిందని చెప్పాడు. ప్రభువు బల్ల గూర్చిన ఈ ఉపదేశం ఆ ప్రత్యక్షతలో
నుండి వచ్చింది.
ఆ తరువాత ప్రభువు బల్ల యొక్క అంతరార్ధం, క్రమమును పౌలు బోధిస్తున్నాడు. ఏ
సమయములో అది నియమించబడిందో వివరించాడు. అది ప్రభువు “అప్పగింపబడిన రాత్రి”.
అది ప్రభువు సిలువ వేయబడకముందని, సిలువ ఇక వేయబడనున్న సమయములో ఇవ్వబడిన
నియమం. పస్కా బలిభోజన సమయములో పొంగని రొట్టె తీసుకొని, దాన్ని విరిచి, “ఇది మీకోసం
విరువబడ్డ నా శరీరం. “నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై” దీనిని చేయమని చెప్పాడు. యేసు ప్రభువు
సిలువ మరణం అత్యంత కిరాతకమైన, క్రూరమైన ఘటన. ప్రభువు శరీరం విరువబడింది.
ప్రభువు మరణించాడో లేదో శతాధిపతి చూచి, అప్పటికే ప్రభువు మరణించినట్టు
నిర్ధారించుకున్నాడు. కాబట్టి సాధారణంగా చేసే కాళ్ళు విరుగగొట్టకుండా, ప్రక్కలో బల్లెముతో
పొడిచి చూచాడు.
ప్రియులారా, ప్రభువు చెప్పిన మాటలు మీ చెవుల్లో నాటనీయండి: ఈ రొట్టె మీ కోసం
విరువబడిన నా శరీరానికి గుర్తు. ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని
చేయమన్నాడు. ఇంకా ముందుకుపోయి 25వ వచనం చూద్దాం. “ఆ ప్రకారమే భోజనమైన
పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు
దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.” ఆ
పాత్ర యేసు క్రీస్తు రక్షకుడు మనకోసం చిందించిన పరిశుద్ధ రక్తమునకు గుర్తు. అది క్రొత్త
నిబంధన. అనగా చట్టం లాంటిది. ఇది దేవుడు చేసిన నిబంధన, చట్టం. దాన్ని వ్రాసి, సంతకం
చేసి, ముద్ర వేస్తారు. కానీ ఈ నిబంధన దేవుడు చేసింది. సీనాయి కొండ మీద చేయబడిన పాత
నిబంధన జంతువుల రక్తముతో ముద్రించబడింది. ఈ క్రొత్త నిబంధన క్రీస్తు పరిశుద్ధ రక్తముతో
ముద్రించబడింది. ప్రభువు బల్ల లో పాలు పొందినప్పుడల్లా యెసయ్య రక్తమును గుర్తు చేసుకొని,
ప్రభువు త్యాగపూరిత మరణమును, బలియాగమును గుర్తు చేసుకోవాలి. ఆ తరువాత ఎన్ని
మారులు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఉన్నాడు. 26వ వచనం. “మీరు ఈ రొట్టెను తిని, యీ
పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును
ప్రచురించుదురు.” ప్రభువు బల్ల లో పాలుపొందినప్పుడల్లా మనము రెండు వైపులా
చూస్తున్నాము. వెనుకకు ప్రభువు మరణము వైపు, ముందుకు ఆయన రాకడ వైపు! హల్లెలూయ!
“నన్ను జ్ఞాపకం చేసుకొని” అని ప్రభువు చెప్పిన మాటలు మన చెవుల్లో లోతుగా నాటుకోవాలి.
ఒక బైబిల్ పండితుని ఉపదేశం విందాం. ఈ నియమములోని ఉద్దేశ్యము, నమూనా ఇక్కడ
తెలుస్తున్నది. మన విమోచకుని జ్ఞాపకము మదిలో ఉంచుకోవడానికి ఇది చాలా గంభీరమైన
నియమం. చాలా సున్నితమైన ప్రభువు విజ్ఞాపనకు, కళ్ళకు కనిపించే రొట్టె ద్రాక్షరసము మనలో
లోతైన భావో ద్వేగాలు కలగాలి, హృదయ పరివర్తనకు కలగాలి. మనము ఎంత త్వరగా
మరిచిపోయేవారమో రక్షకునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన జ్ఞాపకాలు మనలో భద్రంగా
ఉండాలని మన రక్షకుడు ఈ లోకములో మునిగిన మనకు ఈ బలమైన గుర్తు ఏర్పాటు చేశాడు.
ప్రభువును జ్ఞాపకం చేసుకున్నపుడు మాత్రమే సరియైన యోగ్యమైన రీతిగా పాలుపొందినట్టు.
యేసురక్షకుడు నీ పాపము కోసం ప్రాయశ్చిత్తం చేసినట్టు మన మనసుల్లో లోతైన, చురుకైన,
స్పష్టమైన ముద్రలు వేసిఉండాలి. కాబట్టి మనకు ప్రభువు బల్ల లో పాలుపొందడానికి రెండవ
మార్గదర్శకము ప్రభువు మరణమును జ్ఞాపకం పెట్టుకొనండి, గుర్తు చేసుకొనండి.
ప్రార్ధన: మీరే స్వంతగా, యధార్ధంగా, వ్యక్తిగత మైన ప్రతి పాపమును, అవిధేయతను,
తిరుగుబాటును, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకొని ఆయనకృపను అడుగుతూ
హృదయపూర్వకమైన ప్రార్ధన చేసికొనండి. మీకు ఆత్మీయమైన ప్రార్ధన సహాయం
అవసరమైతే ఫోన్ చేయండి: ఫోన్: 8143178111
No comments:
Post a Comment