I కొరింథీ అధ్యయనం-24 8:1-13 మీరెలా జీవిస్తున్నారో, జాగ్రత!

I కొరింథీ అధ్యయనం-24   8:1-13

మీరెలా జీవిస్తున్నారో, జాగ్రత!

 

జీవితం ఎంతో కష్టంగా సాగుతుందా? మీ భారాలు మీరే మోస్తే అలాగే ఉంటుంది. చింత మిమ్మల్ని వేధిస్తుందా? “మీ 

చింత యావత్తు ఆయన మీద వేయ”మని సర్వశక్తి, సర్వాధికారము కలిగిన ప్రభువు పిలుస్తున్నాడు. I పేతురు 5:7 

“ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ లేఖన 

భాగమును కంఠస్థం చేయండి, హృదయములో ఎల్లప్పుడూ ధ్యానించి, విశ్వసించి చింతమీద విజయం పొందండి. 

    

    పౌలు దినాల్లో యూదులు యూదేతరులు కూడా జంతువులను బలిచేసేవారు. ఆ తరువాత ఆ పశువు మాంసమును తిని ఆ విగ్రహము గాని దేవుడని నమ్మిన వారితో సహవాసము చేసినట్టు భావించే వారు. కోరింథు పట్టణములో విగ్రహారాధన చేస్తున్నవారు కొందరు క్రైస్తవ విశ్వాసులను ఆ భోజనాలకు ఆహ్వానించేవారు. విగ్రహాలకు అర్పించిన ఆహారము క్రైస్తవ విశ్వాసులను ఏ విధంగా ప్రభావితం చేస్తుదో I కోరింథీ 8వ అధ్యాయములో పౌలు వివరించాడు. ఈ మాంసము కంటే ఇంకా ప్రాముఖ్యమైన అంశము ఈ లేఖన భాగములో దాగిఉన్నది. ఈ భోజన విషయములో మరి ప్రాముఖ్య మైన జ్ఞానము పొందే అనుభవము గూర్చి ఆయన వివరిస్తున్నాడు. I కోరింథీ 8:1-13 వచనాల ఈ లేఖన భాగములో ఉన్న అంశము మీరెలా జీవిస్తున్నారో, జాగ్రత!  ఇచ్చోట కొన్న పునాదుల్లాంటి సమీకరణాలు ఉన్నవి. వాటిలో మొదటిది, జ్ఞానము ప్రేమకు గల సంబంధం.  మొదటి 6 వచనాలు గమనించండి, విగ్హములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.  కాబట్టి విగ్హములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్హము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు  మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసు క్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.”  అపోస్తలుడు అంటున్నదేమిటి? అందరికీ జ్ఞానమున్నది. కొందరికి కొంచెం, మరి కొందరికి ఎక్కువ. మనసుకు రెండూ సాధ్యమే. అందుకే మన పిల్లలను బడికి పంపిస్తాము. 

        అక్కడ వారికి విద్యాభ్యాసము కలుగుతుంది. అందుకే పుస్తకాలు చదువుతూ ఉంటాము. జ్ఞానము సంపాదించుకుంటాము. కొందరు వారు సంపాదించిన జ్ఞానమును బట్టి గర్విస్తారు. వారికున్న జ్ఞానముకంటే ఎక్కువ ఉందని భ్రమిస్తారు. ఆపో. ఏమని ఉపదేశిస్తున్నాడో చూడండి. 2వ వచనo. “ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.”  మనకు తెలిసినదానిని, ఇంకా తెలుసుకోవడానికి మిగిలియున్న వాటిని ఆలోచిస్తే, మనకు తెలిసింది చాలతక్కువ. నాకింత తెలుసు అని ఏ ఒక్కరూ గర్వించలేరు. తెలుసుకొనకపోవడం కంటే జ్ఞానమే మంచిది. కానీ పౌలు జ్ఞానము ఉప్పొంగజేయును” అంటున్నాడు. జ్ఞానముకన్న ప్రేమ గొప్పది. ఇవి రెండు పరిపూర్ణంగా దేవునివద్ద ఉన్నవి. ఒకవ్యక్తి ప్రేమను చూపిస్తే అతడు దేవుని ఎరిగినవాడని చెప్పవచ్చు. అతణ్ణి దేవుడు ఎరిగిఉండవచ్చు. ప్రేమకు దేవునికి సన్నిహిత సంబంధం ఉన్నది. ఒక ప్రముఖ బైబిల్ పండితుడు ఏమంటున్నాడో వినండి. కేవలం జ్ఞానము సంపాదించడము కంటే దేవుణ్ణి ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం వలన మనమేమి చేయాలో నిర్ణయించుకుంటాం. దానిద్వారా ఇతరుల మేలు కోరడం, వారికి కీడు చేయకుండా ఉండడం సాధ్యమవుతుంది. అప్పుడు  మనము మృదుత్వము, అభిమానము, దయతో నింపుతుంది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో తెలుసుకుంటాం. ఈ సమీకరణంలో ప్రేమ జ్ఞానమునుకన్న మిన్న.

         రెండవ సమీకరణం జ్ఞానము మనస్సాక్షికి గల సంబంధం. 7,8 వచనాలు అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు. “ ఏది సరియైనదో ఏది సరియైనది కాదో పరిశీలిద్దాం. దాని ఫలితం ఏదైనా సరే, సరియైనదికానిది చేయడం ఎప్పుడూ సరియైనదికాదు. ఫలితం మంచిదైనంత మాత్రాన చేసే పద్ధతి మంచిది కాదు. ప్రతి మనిషిలో మనస్సాక్షి ఉన్నది. అది ఆత్మలో దేవుని స్వరం. ఎంత దుష్టునికైనా, ఎంత అవివేకికైనా మనస్సాక్షి ఉన్నది. అది అతనికి ఏది సరియైనదో, ఏది కాదో తెలుపుతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి. ఏ ఒక్కరూ వారికి తెలిసినదంతటినీ చేయలేరు. ఇది మనకు ఎల్లప్పుడుండే సమస్యే! మనము చేసేదానికంటే ఎక్కువ మనకు తెలుసు. మనస్సాక్షి ప్రతి ఒక్క క్రియను విమర్శిస్తుంది. చాలా కాలం నీతి బోధకులు ఒక మధ్యస్థమైన ప్రాంతముంటుంది, అక్కడ ఉన్నది సరియైనది అని చెప్పలేము, సరియైనది కాదని చెప్పలేము. ఆ ప్రాంతములో ఉన్నది ఏదైనా చేయవచ్చని వారి చెప్పారు. కానీ అటువంటి ప్రాంతమంటూ లేనేలేదు. ఇద్దరి మధ్యలో మీరు పరీక్షిస్తున్నపుడు ఉండవచ్చేమో కానీ, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నపుడు అలాంటిది ఉండదు. ప్రతి ఒక్కరికీ తన ప్రవర్తనను నిర్ణయించే

నియమ నిబంధనలు ఉంటాయి, ప్రతి ఒక్కరూ తన ప్రవర్తనకు తన మనస్సాక్షికి లెక్క చెప్పాలి. ఇక్కడ విగ్రహాలకు అర్పించిన ఆహారం విషయం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి విగ్రహాన్ని పూజించిన తరువాత అక్కడ చేయబడ్డ ఆహారమును తీసుకున్నపుడు విగ్రహం దేవుడని అతడు నమ్ముతున్నాడని అర్ధం. కొందరు కోరింథీలోని విశ్వాసులు దాన్ని అలా పట్టించుకోలేదు. విగ్రహములో ఏమీ లేదని వారన్నారు. తిన్న తినకపోయినా ఏమీ బేధము లేదని వారు నమ్మారు. జ్ఞానము తినే హక్కు వారికి ఇచ్చిందని వారు అన్నారు. దాని శాఖోపశాఖలు వారు ఆలోచించలేదు. అదే విధంగా ఈనాడు చాలామంది క్రైస్తవ విశ్వాసులు వారి ప్రవర్తనలోని లోతుపాతులు గ్రహించడం లేదు. వారు ఇతరులకు అడ్డుబండగా ఉండవచ్చు. జ్ఞానముకంటే మనస్సాక్షి గొప్పది. బైబిల్ పoడితుల బోధ నేర్చుకుందాం. కర్రతో చేయబడ్డదైనా, రాయితో చేయబడ్డదైనా, ఒక విగ్రహమునకు తెలివితేటలు ఉన్నాయని గాని, దాన్ని నమ్ముకున్నవారికి అది మేలైనా, కీడైనా, చేయగలదని గాని, అది ఆరాధనకు యోగ్యమైనదని గాని నమ్మేటంత బుద్ధిహీనులము మనము కాదు. ఇదంతా భ్రమింపజేసేది. అవి ఆరాధింపదగ్గవి కాదు.

సజీవుడైన దేవుని ఆరాధించి, నిజముగా హృదయపూర్వకంగా ప్రేమించడం, మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండే విధంగా సృష్టికర్త, సజీవుడైన దేవుని, యేసు క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసముతో సేవించుదాం. మీరెలా జీవిస్తున్నారో, జాగ్రత! జ్ఞానముకన్న మనస్సాక్షి మిన్న.

         మూడవ సమీకరణం, జ్ఞానము స్వాతంత్రమునకున్న సంబంధం. 9-13 వచనాలు. అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు. కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.”  ఆపోస్థలుని హెచ్చరిక ఏమిటి? స్వాతంత్రమును ఇతరులను బాధ పెట్టడానికి ఉపయోగించకూడదు. “మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.”  జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? క్రొత్త నిబంధనలో స్వాతంత్ర్యము అనే మాటకు అధికారము అనే అర్ధం వస్తుంది. 

    

అప్పుడప్పుడు బలము అనే అర్ధం వస్తుంది. కాబట్టి దీని అర్ధం ఏమిటంటే మీకున్న అధికారము లేదా బలము ఇతరులకు అడ్డుబండ కాకుండా చూడండి. ప్రతి ఒక్కరూ వారి ప్రవర్తనను ఎలా అదుపులో ఉంచుకోవాలంటే, అది ఇతరులకు అడ్డుబండగా మారకూడదు. మనము ఎంత చిన్నవారమైనా, ఎంత పెద్దవారమైనా, ప్రజలమధ్యలో ఉంటాము కదా! ఎవరో ఒకరు మనలను గమనిస్తూ మన ప్రవర్తననుబట్టి తీర్మానాలు చేసుకుంటారు. ఇది కొంచెo, భయమును, జాగ్రతను మనలో కలిగిస్తుంది. నీదగ్గరున్న సహోదరుణ్ణి గమనములో ఉంచుకొని నీవు చేసేది ఏదైనా సరియైనది చేయి. నీవు చేసేది నీ ప్రక్కనున్న సహోదరుని మనస్సాక్షిని బలహీనపరచకూడదు, కష్టపెట్టకూడదు. ఆ వ్యక్తితో మీరింత చాదస్తంగా ఉన్నారేమిటి?’ మీరనవచ్చు. కాని, మిమ్మల్ని మీరు చూసుకొని మీ క్రియనుబట్టి వారేవిధంగా ఫీలవు తున్నారో గ్రహించాలి. ఇతరుల మనస్సాక్షిని అతిక్రమించే స్వాతంత్ర్యము, అధికారము, మనకు లేదు. మన మనస్సాక్షిని మనము పరీక్షించుకోవాలి, అప్పుడు వారు కూడా పరీక్షించుకుంటారు. ఈ అధ్యాయము చివర్లో అపొ. ఒక అద్భుతమైన మాట చెప్పారు. “కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను. ప్రియులారా, ఈ విధమైన రూపంత్రo చెందే ప్రక్రియలో యేసు ప్రభువే మనకు మాదిరి. ఒక బైబిల్ పండితుడు ఏమంటున్నాడో విని నేర్చుకుందాం. “క్రీస్తు ఎంతో ధనికుడైనా, అందరూ ఆయనను అనుసరించేటంతగా సర్దుకుని జీవించారు. ప్రభువు లోకమంతటికీ విమోచకుడుగా ఉండికూడా, ఏ స్థాయిలో ఉండేవారైనా, తనను వెంబడించే విధంగా జీవించారు. ఆయన సర్వాధికారము కలిగినవాడైనా, దేవదూతలు ఆయనను ఆరాధిస్తున్నా, అందరికంటే దీనస్థితిలో తక్కువ స్థాయిలో ఉండేవారికి ఎలా జీవించాలో బోధించారు. అందరికీ మాదిరికరమైన జీవితము దీనమైన జీవితము జీవించారు. అదే విధంగా ప్రతి చక్రవర్తి, అధికారి, ధనికుడు, ఘనులైనవారు, విద్యాధికులు, ఉన్నతస్థాయిలో ఉన్నవారు, ప్రతి కుటుంబ యజమాని, ఏ వయసువారైనా, ఎంత జ్ఞానము కలిగినవారైనా, ప్రభువు జీవించినవిధంగా జీవించగలిగితే, చూసే వారు వారి అడుగుజాడల్లో వెంబడించగలుగుతారు.

శ్రోతలూ, ఆహారము, బట్టలు, ఇల్లు కంటే జీవింతo ప్రాముఖ్యమైనది. అందుకే మనమెలా జీవిస్తున్నామో, జాగర్తగా పరీక్షించుకోవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. మూడు ముఖ్యమైన అంశాలు గుర్తు చేసుకుందాం. 

1. జ్ఞానము-ప్రేమ  జ్ఞానమును ప్రేమతో సమతుల్యం చేసుకోవాలి.

2. జ్ఞానము-మనస్సాక్షి  జ్ఞానమును మనస్సాక్షితో సమతుల్యం చేసుకోవాలి.

3. జ్ఞానము-స్వేచ్చ. జ్ఞానమును స్వేచ్ఛతో సమతుల్యం చేసుకోవాలి. దీనికి అవసరమైనoత మహాకృప యేసు ప్రభువు మనకందరికీ, ఒక్కొక్కరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక, అమెన్!

 


No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...