I కోరింథీ అధ్యయనం-4 1:26-31
దేవుని అతిశ్రేష్టమైన ప్రణాళిక,సంకల్పం
రోమా పత్రిక, కొరింథీ పత్రిక అధ్యయనాలద్వారా, మీరు మీ ఇంటిల్లిపాది పొందుతున్న మేళ్ళు, ఆదరణ, శాంతి
సమాధానం, మాతో తప్పకుండా పంచుకోండి. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాము. మీ ప్రార్ధన అంశాలు వివరంగా
వ్రాయండి. ఫోన్లో చెప్పండి. “ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా
నాశనమగును.” అని ప్రభువు సామెతలు 29:1 లో ఇచ్చిన హెచ్చరిక చాలా ఖచ్చితమైనది. నీ జీవితములో ఎన్నో
అవకాశాలు ప్రభువు ఇచ్చాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదని ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసు క్రీస్తు
ప్రభువు షరతులు లేని నిత్యప్రేమతో, షరతులు లేని క్షమాపణ ఇస్తుండగా, ఈరోజే, ఇప్పుడే నీవు పాపివని
ఒప్పుకొని, హృదయ పూర్వకంగా మనసారా, క్రీస్తు ప్రభువునకు మీ హృదయం తెరవండి.
సిలువ మెడలో ధరిస్తే పరిశుద్ధులమవుతామా? ప్రభువు బల్లలో చేయివేస్తే పాపమంతా కడుగబడుతుందా?
చాలా పెద్ద పేరుగడించిన సంఘఆవరణము లోనికి వెళ్తే నిత్యజీవము దొరుకుతుందా? వేలాదిమంది ఉండే
సంఘములోఉంటే పరలోకము తప్పకుండా చేరతామా? క్రమము తప్పకుండ దశమభాగము ఇచ్చినంత మాత్రాన
పాపమంతా శుద్ధి అయిపోయిందా? ఏ ఆచారము, నీతిక్రియలు, దానధర్మాలు, మన పాపములను శుద్ధి చేయవు.
బయటికి ఎంత పవిత్రంగా పరిశుధ్ధంగా ఉన్నట్టుగా భ్రమించి ఎన్ని చేసినా, అంతరంగం పరిశుధ్ధం కాలేదుకదా!
ఆపో. పౌలు గలతీ పత్రిక 5:19-21లో శరీర కార్యములు లేదా పాప స్వభావపు గుణములను తేటపరిచాడు.
“శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము,
ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు
దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.” ఇది విన్నతరువాత ఏమి చేయాలి?
మీలో నాలో ఇవి ఉన్నవని మనము ఒప్పుకోవాలి. వీటిని కలిగించే పరిస్థితులు, స్వభావము మనలో ఉన్నవని
మనము మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. వీటినుండి విడుదల పొందదానికి దేవుని వద్ద శ్రేష్టమైన మార్గము ఉన్నదని
గ్రహించాలి. ఏ విధంగా, ఏ పద్ధతిలో? ఈ పధ్ధతేమిటో I కోరింథీ 1:26-31 అధ్యయనం చేసి తెలుసుకుందాం.
“దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె
బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను,
గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని
సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము
చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని
యున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే
అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు
పరిశుద్ధతయు విమోచనమునాయెను.” ఈ లేఖనభాగములో కనిపించే దేవుని ప్రణాళిక ఎందుకు శ్రేష్టమైనదంటే,
మనకు అతిక్లిష్టమైన రీతిగా అవసరమైనవి, మనంతట మనమే సంపాదించుకోలేనివి దేవుని ప్రణాళికలోనే ఉన్నాయి.
వాటిలో మొదటిది, దేవుని పిలుపులోని విశిష్టత. 26వ వచనం: “సహోదరులారా, మిమ్మును పిలిచిన
పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు
పిలువబడలేదు...” లోకరీతిగా వారికేవారే స్వయం సమృద్ధి గలిగిన జ్ఞానులు పిలువబడలేదు. ప్రియ శ్రోతలూ,
ఎంతటి విద్యావేత్తలైనా, మీ రక్షణకోసం అవి ఏ విధంగా సహాయపడవని, పనికిరావని చెప్పక తప్పదు. దేవుని రక్షణ
ప్రణాళిక విషయం మట్టుకైతే, మీ విద్యార్హతలు లెక్కలోనికి రావు, వాటి అవసరత లేదు. అంతే కాదు, ఆపో. ఘనులు
కూడా పిలువబడలేదని బోధిస్తున్నాడు. శక్తిమంతులకు దేవునియెదుట స్థానము లేదు. ఎందుకనగా “నా అంతటా
నేనే చేసుకోగలను, నాకెవ్వరి సహాయము అవసరము లేదు’ అనే భావనతో వారుంటటారు. మానవతా వాదుల
దృక్పధమదే. ‘ఎవరిపైనా ఆధారపడే అవసరం నాకు లేదు. నేను తప్ప ఇతరుల అవసరం నాకు లేదు’ అనుకుంటూ
ఉంటారు. ఇది ఎంత దయనీయమైన పరిస్థితి! ఆపో. ఇంకా ముందుకు పోయి గొప్ప వంశము వారు కూడా దేవుని
చేత పిలవబడలేదని తేటపరుస్తున్నాడు. అనగా గొప్ప పేరుగల వంశస్థులు. వారి ఇంటిపేరు ఎంత గొప్పదో అని
గర్వించేవారుంటారు. ‘నాదో గొప్ప రాజవంశము, మా పుట్టు, పూర్వోత్తరాలు ఏమిటో మీకు తెలుసా?’ అంటూ విర్ర
వీగేవారున్నారు. కాని ప్రభువు అంటున్న మాటలేమిటి? గొప్ప వంశపు వారిని ఆయన పిలవలేదు. ప్రియులారా,
దేవుని యెదుట పక్షపాతములేదు. ఆయన ముఖమును చూడడు. బైబిల్లో దీనిగూర్చి ఒక ఉదాహరణ ఉన్నది.
పరలోకమునకు ఎలా వెళ్లాలో తనను అడిగిన ఒక వ్యక్తితో ప్రభువు ఏమన్నారో లూకా సువార్త 18:18-24లో
ఉన్నది. ఇది మీరు స్వయంగా చదవాలి.
రెండవ లక్షణము, నిర్దిష్టమైన పరిష్కరించే దేవుని ఎంపిక. “ఏ శరీరియు దేవుని యెదుట
అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు
ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు
ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని,
ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.” ఆపో. అట్టడుగులో ఆరంభించి ఇంకా క్రిందికి వెళ్ళినట్టు
కనిపిస్తున్నది. అట్టడుగు అని ఎందుకంటున్నామో మీరు గమనించాలి. “లోకములో నీచులైనవారిని” అనే మాటను
గమనించారా? అనగా లెక్కకురానివి, మానవుల దృష్టిలో పనికిమాలిన వని అర్ధం. మనము అట్టడుగులో
మొదలెడతామా? కానీ పౌలు అక్కడ మొదలుపెట్టాడు. ప్రియులారా, దేవుడు అక్కడే మొదలు పెట్టాడు. దేవుని
అతిశ్రేష్టమైన ప్రణాళిక అట్టడుగువారితో, లోకములో విలువలేని వారిని, ప్రక్కకు నెట్టేసినవారితో వారితో
ఆరంభమైంది. హల్లెలూయ! మనము అట్టడుగుకు వెళ్లిపోతున్నాము. విలువలేనివారము, నీచులము, చివరలో
అసలు కనిపించము. లైన్లో చివరలో ఉంటాము. అది దేవుని అద్భుతమైన శ్రేష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక!
ఎంతో విలువైనవిగా ఎంచబడేవి ఏమాత్రం విలువలేనివి, లెక్కలేని వాటిచేత త్రోసివేయబడతాయి.
“ఎన్నికైనవారిని వ్యర్ధము చేయుటకు లోకములో నీచులైనవారిని” దేవుడు ఏర్పరచుకున్నాడు. ఫలితం ఏమిటి? ఏ
శరీరియు దేవునియెదుట అతిశయించడానికి వీలులేదు. ఫిలిపీ 3:5-11ను ఈ లేఖనానికి పోల్చుకొని చూడండి.
దేవునివద్దకు వచ్చేటప్పుడు నీవేమి తీసుకొచ్చినా, ఉపయోగముండదు. దేవుని అతిశ్రేష్టమైన ప్రణాళికను
ఆస్వాదించాలనుకుంటే, ప్రియ శ్రోతలూ, ఏమీ లేకుండా, మనమేమీ కాదని, మనవద్ద ఏమీ లేదని తగ్గించుకొని
రావాలి.
ఇక మూడవ లక్షణం, దేవుని అతిశ్రేష్టమైన ప్రణాళికలోని అందరినీ కలుపుకునే నియమ
నిబంధన. 30-31 వచనములు. జాగ్రతగా గమనించాలి, “అయితే ఆయన మూలముగా...” దేవుని ప్రణాళిక
మనుష్యుల ప్రణాళికలనుండి క్రీస్తు యేసు వైపునకు మళ్ళుతున్నది. దేవుని ప్రణాళిక యేసు ప్రభువుద్వారా
ఉన్నది. ఆయన ద్వారా నాలుగు అనుభవాలు కలుగుతున్నవి. జ్ఞానము, నీతి, పరిశుధ్ద్ధత, విమోచన. రక్షణలోని
సంపూర్ణతలో ఇవి ఒక భాగము. మానవ జ్ఞానములో నిజమైన జ్ఞానము లేదు. దైవ జ్ఞానమును “సోఫియా”
అంటారు. దేవుని జ్ఞానము క్రీస్తులో సమృద్ధిగా ఉన్నది. ఒక తత్వవేత్త తన జ్ఞానమంతటితో చూడలేనిది, ఒక క్రీస్తు
శిష్యుడు, విశ్వాసి తన మోకాళ్ల మీద చూడగలడు. నీతి అనగా దేవునితో సరియైన సంబంధము. మనమంతా
స్వభావసిద్ధంగా దేవునికి దూరస్థులము. రోమా. 3:23. “ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి
దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోవు చున్నారు.” ఈ పరిస్థితుల్లో మనకు యేసు క్రీస్తు ప్రభువు అవసరత
ఉన్నది. క్రీస్తునందు పాపులమైన మనకు క్షమాపణ, రక్షణ ఉన్నది. ఇప్పుడు దేవుడు క్రీస్తును బట్టి మనలను
ఎన్నడూ పాపము చేయని వారిలాగా చూస్తాడు. ఎంతటి ధన్యత! ఆ తరువాత ఆయన మనకు పరిశుద్ధత
అయ్యాడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. క్రీస్తును బట్టి మనము పరిశుద్ధులమయ్యాము. పౌలు రోమా 6:18,19లో
విపులీకరించినట్టు, మనము మనశరీర అవయవములను క్రీస్తుప్రభువునకు అప్పగించాలి. ఆ తరువాత విమోచన.
సంపూర్ణంగా, మొత్తముగా, ఏదీ విడిచిపెట్టకుండా ప్రభువు మనలను విమోచించాడు. ఆత్మ, మనసు శరీరాలను
ఆయన విమోచించాడు. దాని అర్ధమేమిటంటే, మనకోసం ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు; క్షమించాడు, పాపపు
అధికారం, ప్రభుత్వమునుండి మనకు విడుదల ఆయన ద్వారా దొరికింది; మన శత్రువులబలమునుండి
ఆయనద్వారా విమోచన దొరికింది; ఆయనను బట్టి మనకు సమాధినుండి విడుదల పొందుతాము;
నిత్యజీవమునకు లేపబడతాము; ఈ విధంగా మన సమస్తము క్రీస్తు ప్రభువు మీద ఆధారపడి ఉంటుంది.
అందుచేత, ఆయననుబట్టి మాత్రమే అతిశయించవచ్చు, ఆనందించవచ్చు. అట్టి కృప ప్రభువే మనకందరికీ సర్వ
సమృద్ధిగా అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment