I కోరింథీ – అధ్యయనం-2 1:10-17
ఎదుగుతున్న సంఘము కలిగుఉండాలంటే ఏమి చేయాలి?
మీలో ప్రతి ఒక్కరికీ వందనములు, మీరంతా బాగున్నారా? మీ ప్రార్థన అంశాలు ఒక ఉత్తరం, లేదా మెసేజ్ ద్వారా
తెలియచేయండి. అడ్రస్ చివరలో ఇవ్వబడుతుంది, జాగ్రతగా రాసుకోండి, లేదా ఫోన్ చేసే తెలుసుకోవచ్చు. రండి,
రేడియో కు దగ్గరగా వచ్చి కూర్చోండి, దేవుని వాక్యమును అధ్యయనం చేసి ఆయన కృపను పొందుదాం. ప్రార్థన:
క్రైస్తవ్యం ఒక సౌవార్తిక విశ్వాసం. యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందకుండా మరణించే వారికి నిత్య
నరకం తప్పదని మనకు తెలుసు కాబట్టి మనము సౌవార్తీకరణ చేయాలి. అనగా క్రీస్తు చెంతకు మనుషులను
నడిపించాలి. చర్చ్ బిల్డింగ్ ముఖ్యం కాదు, ఆత్మల సంపాదన ముఖ్యం. సంఘమంటే మారుమనసు పొందిన దేవుని
ప్రజలు. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో చర్చ్ బిల్డింగ్ ఉండదు, కానీ విశ్వాసులు ఒక చోట చేరి ప్రేమతో,
అప్యాయతలతో పరిశుద్ధతలో నిండిన సహవాసముగా కూడుకొని ప్రభువును ఆరాధిస్తారు. సంఘమంటే అదే! మీరు
అలాంటి సహవాసములో భాగమేనా?
ఈ పూట I కోరింథీ 1:10-17 అధ్యయనం చేద్దాం. మీ బైబిల్ తెరిచి నాతో బాటు గమనించండి:
10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు
తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
11 నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి
క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను.
12 మీలో ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా
తాత్పర్యము.
13 క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?
14 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని
యెవరైనను చెప్పకుండునట్లు,
15 క్రిస్పునకును గాయియుకును తప్ప మరి
యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
16 స్తెఫను ఇంటివారికిని
బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.
17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త
ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
ఆపో. పౌలు బోధించిన ఈ మాటలనుండి, మన సంఘాలు ఎదగడానికి అవసరమైన కొన్ని మార్గదర్శకాలు గ్రహించవచ్చు.
మొదటిది, మెచ్చుకోదగిన పద్ధతులను గుర్తించండి. 10వ వచనం. “సహోదరులారా, మీరందరు
ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు
సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.” యేసు
క్రీస్తు చుట్టూ చేరాలి. గమనించండి, కోరింథీ సంఘస్తులను ఆపో. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనవి
చేస్తున్నాడు. ఆ పేరును ఒక్కసారి పరీక్షిద్దాం. ప్రభువు అంటే అర్ధం ఆయనకు పైన ఏ అధికారి లేడు. ఆయనకు
సంపూర్ణమైన అధికారం ఉన్నది. సంఘములో కార్యాలు, పనులు, పరిచర్యలు ఆయనే ఆదేశిస్తాడు. యేసు ప్రభువు
జన్మించక ముందు, దేవునిదూత గాబ్రియేలు యోసేపుకు కనపడి మరియ జన్మనియ్యబోయే శిశువుకు యేసు
అనే పేరు పెట్టమని చెప్పాడు. యేసు అంటే తన ప్రజలను పాపమునుండి, రక్షించే వాడని అర్ధం. (మత్త. 1:20-21)
యేసు అంటే అర్ధం రక్షించేవాడు. ప్రభువు అంటే సర్వాధికారం గలవాడు. క్రీస్తు, అనగా అభిషిక్తుడని అర్ధం.
రక్షించడానికి శక్తి అభిషేకం, పిలుపు కలిగినవాడు. యేసు క్రీస్తు ప్రభువు పేరునకు అర్ధం ఇదే!
యేసు క్రీస్తు ప్రభువు చుట్టూ చేరి ఒకే మాట పలకమని పౌలు బోధిస్తున్నాడు. మెచ్చుకోదగిన పద్ధతులను
గుర్తించండి. ఒక్కటే మాట పలకండి. సిధ్ధంతములో ఐక్యత కలిగిఉండండి. ఏ విభేదాలు ఉంచుకోవద్దు.
సంవత్సరాలతరబడి, శతాబ్దాలుగా, సంఘాల్లో మనుషులు హింసాత్మకంగా ఒకరితో మరొకరు విభేదించి ఒక్కమాట
ఒక్క పలుకు మాటలాడలేదు. దానివల్ల అతిభారీ నష్టం సంఘానికి జరిగింది. ప్రియులారా, మనమంతా గొడ్డళ్ళు
పడవేసి మనము దేవుని పరిశుద్ధలేఖనాలను అనుసరిస్తే మిక్కుటమైన ఐక్యత కలుగుతుంది. ఈ చిన్న చిన్న
విభేదించే గుంపులు అప్పుడు ఉండవు. ఆపో. పౌలు మీరందరూ ఏకభావముతో మాటలాడాలని హెచ్చరిస్తున్నాడు.
మనసులో, తీర్పులలో పరిపూర్ణంగా ఒకరితో మరొకరు కలిసిఉండి సామరస్యంగా జీవించాలి. చిన్న
విషయాలన్నింటిలో మీరు ఒకరితోమరొకరు అంగీకరించకపోయినా కరుణా, దయ కలిగిన ప్రవర్తనతో మెలగాలి.
ఒకరిని మరొకరు చీల్చుకున్నట్టుగా మాటలాడుకోవడములో ఏమాత్రం మేలు లేదు. ఏది మంచిదో దాన్ని మట్టుకు
అంగీకరించండి.
రెండవది, పోటీపడి విభేదాలు కలిగించే వ్యక్తులను నిర్వీర్యం చేయండి 11,12 వచనాలు. “నా
సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను. మీలో
ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను
క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.” ఇక్కడ నలుగురి పేర్లు ప్రస్తావించబడ్డాయి. పౌలు, అపోలో,
కేఫా, క్రీస్తు. విభేదాలు ఎక్కువసార్లు మనుషులచుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక వేదాంత విద్యార్థుల క్లాస్ లో
అధ్యాపకుడు ఏమని చెప్పాడంటే, ‘నీవు ఒక సంఘములో పరిచర్య చేయడం మానేస్తే, మానేయవచ్చు. కానీ
అందులో విభేదాలు కలిగించవద్దు. నీకు అనుకూలమైన వారిని పోగుచేసుకొని గ్రూపుకట్టవద్దు. పార్టీలు పెట్టవద్దు.
కానీ ఈ
జాడ్యం కోరింథీ సంఘములో బాగా వ్యాపించి పాతుకుపోయింది.
ఒక గుంపు పౌలు గుంపు. ఆయన ఈ సంఘమును స్థాపించినవాడు.యూదేతర విశ్వాసులను
బలపరిచేవాడు. వారికోసం ఆయన నిలువబడ్డాడు. క్రీస్తు శరీరమనే సంఘములో వారు ఎలా వస్తారో ఆయనకు
తెలుసు. వారు మోషే ధరశాస్త్రమును బలపరిచే యూదు విశ్వాసులతో వారి సహవాసం చేయగలరు తన పత్రికలు
బలమైనవి కానీ ఆయన బలహీనుడనీ, అల్పమైనవాడనీ కొందరు ఆరోపించినప్పుడు, పౌలు II కోరింథీ పత్రికలో
వారిని ఎదిరించాడు. ఇక్కడ పౌలు పార్టీ కనిపిస్తున్నది.
ఇక అపోలో పార్టీ ఉన్నది. ఆయన ఒక మంచి వక్త, ప్రసంగీకుడని తప్ప ఈయనగురించి మరేమీ తెలియదు.
ఆయన ఎఫెసీకి వచ్చి ఆకుల ప్రిస్కిల్లలను కలుసుకొన్నపుడు, వారు ఆయనకు సువార్తను విపులీకరించి
బోధించారు. ఆయనకు యోహాను బాప్టిస్మమే తెలుసు. క్రీస్తు ప్రభువు గురించి వీరు ఆయనకు బోధించారు.
అంతవరకు అది ఆయనకు తెలియదు. అపోల్లో తన సుబోధ చేత తార్కికమైన మాటల చేత చాలమందిని
మెప్పించినందు చేత కొందరు ఆయన పార్టీ అయ్యారు.
ఇక కేఫా పార్టీ ఉన్నది. అంటే ఇది పేతురు పార్టీ. పెంతెకొస్తు దినాన ఆయన అద్భుతమైన ప్రసంగం చేసి
పరిశుద్ధాత్ముడు విశ్వాసులమీద కుమ్మరించబడినపుడు ఆయన తలుపు తీసినవాడు. పేతురు మొదట
కైసరయలోని కొర్నెలిద్వారా యూదేతరులకు సువార్తను తీసుకెళ్ళాడు. కానీ పేతురు పడిపోయాడు. పేతురు తన
స్వదేశస్థుల ముందు తట్టుకోలేకపోయాడు. మోషే ధర్మశాస్త్రమును అనుసరించాలని ఆయన వాదిస్తున్నట్టు
అందరూ అనుకున్నారు. ఇక చివరకు, క్రీస్తు పార్టీ. క్రీస్తు మాత్రమే అనేవారు వీరు. కానీ ఇది ప్రభువు ప్రార్ధనకు
వ్యతిరేకమైనది. ప్రభువు తాను సిలువ మీద ప్రాణమర్పించకముందు చేసిన ప్రార్ధనలో సంఘములోని అందరూ
ఐక్యంగా ఉండాలని ప్రభువు కోరిక. తండ్రీ తాను ఏకైమైయున్నట్టు సంఘములోని వారందరూ
ఏకమనస్కులైఉండాలని ప్రార్థన. ఇక్కడ నాలుగు పార్టీలు కనిపిస్తున్నాయి. పౌలు పార్టీ, అపోలో పార్టీ, కేఫా పార్టీ,
క్రీస్తు పార్టీ. పౌలు వారితో “మనమంతా క్రీస్తునందు ఏకమౌదామన్నాడు. ఎవరు మీ కోసం సిలువవేయబడ్డారు?
పౌలు మీ కోసo సిలువ వేయబడ్డాడా? లేదా పౌలు పేరట మీరు బాప్తిస్తము పొందారా? లేదు, యేసు క్రీస్తు
వారికోసం, మనకోసం సిలువ వేయబడ్డాడు. మనము ఆయన నామములోనే ఏకమౌతాము. సందేశమా? మనిషా?
ఏది ముఖ్యం? సందేశం. యేసు క్రీస్తు సిలువవేయబడిన ప్రభువు. కాబట్టి మీ సంఘము ఎదగాలంటే, సంఘర్షణ పడే
వ్యక్తులను నిర్వీర్యం చేయాలి. వారికి అలా ఉండాలనే ఆశ ఉండకనే పోవచ్చు. యెసయ్య చేసిన ప్రార్థన
గుర్తుంచుకుందాం: మనమంతా ఒక్కటిగా ఉండాలనే ప్రార్థన.
మూడవ ఆదేశం, ముఖ్యమైన ప్రకటనను అధికంగా చేయండి : 17వ వచనం. “ బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు
నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే
ఆయన నన్ను పంపెను.” కొందరికి బాప్తిస్మము ప్రాముఖ్యం. కానీ బాప్తిస్మానికి అంత ప్రాముఖ్యత లేదు. మరి
కొందరు ఎలాంటి బాప్తిస్మము అని ఆరా తీస్తారు. ముంచడమా, చిలకరిoపా? నదిలోనా, సముద్రంలోనా?
ముందుకు మునిగావా? వెనక్కా? ఎన్నోన్నో ప్రశ్నలు. ఒక్కొక్కరు ఒక్కో విషయం మీద నొక్కి చెప్తారు. యోర్దాను
నదిలో బాప్తిస్మము ఇతర చోట్ల కంటే మంచిదని కొందరంటారు. ఇశ్రాయేలు దేశంలో అందరూ కలిసి నివసించే ఒక
సొసైటి లాంటి “కిబ్బుట్జ్”లలో బాప్తిస్మాలకోసం ఒక స్థలము ఏర్పాటు చేశారు. యోర్దాను నదిలో బాప్తిస్మము
తీసుకున్నా, లేక “కిబ్బుట్జ్”లో ఏర్పాటు చేయబడిన చోట తీసుకున్నా ఒకటే! మరో మాటలో చెప్పాలంటే, ఎక్కడ
ఎలాగూ తీసుకున్నది ముఖ్యము కాదు, మారుమనసు హృదయములో ఉందా? లేదా? అది ప్రాముఖ్యమైన ప్రశ్న.
ఆపో. పౌలు కోరింథీ సంఘములో ఇద్దరికీ తప్ప తనెవ్వరికీ బాప్తిస్మమివ్వలేదని చెబుతున్నాడు. ఎందుకు? దేవుడు
ఆయనను పంపింది బాప్తిస్మమివ్వడానికి కాదు గాని, సువార్తను బోధించడానికి. దానిలో క్రీస్తుసిలువ వ్యర్ధము
కాకూడదు. నీ పాపము, నా పాపము. సమస్త మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తము చేసింది యేసు క్రీస్తు
సిలువరక్తమే! ఆయన కల్వరిలో సిలువ మీద రక్తము మన పాపమును కప్పివేస్తుంది. తుడిచివేస్తుంది. ఆయన
మరణమునకు సిలువరక్తము ఋజువు. మన కోసం పరిహారం చెల్లించడానికి అది దేవుని ఎంపిక, ఏర్పాటు. రోమా,
3:23-26లో ఆపో. పౌలు సిలువ ను ప్రకటించడము యొక్క ప్రాముఖ్యతను జాగ్రతగా బోధించాడు:
23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు
మహిమను పొందలేక పోవుచున్నారు.
24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులని తీర్చబడు
చున్నారు.
25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన
ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా
బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు
ఆయన ఆలాగు చేసెను.
అవును, ప్రియులారా, యేసు క్రీస్తు సిలువను ప్రకటించడాన్ని ప్రతి చోట, ప్రతి ఒక్కరికీ అందించాలి. కాబట్టి
ఎదగాలని ఆశించే ప్రతి సంఘము పౌలు గారి బోధనను నెరవేర్చి ఈ లేఖన భాగములో ఇవ్వబడిన మూడు
ఆదేశాలను నెరవేర్చాలి: 1. మంచి పద్ధతులను గ్రహించాలి, 2.సంఘర్షణ కలిగించే వ్యక్తులను, పార్టీలు కలిగించే
వ్యక్తులను నిర్వీర్యం చేయాలి. 3.ముఖ్యమైన సందేశమును ఎక్కువగా ప్రకటించండి. ఇవి చేయడానికి
అవసరమైనంత కృప ప్రభువు మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment