గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!
రోమా పత్రిక అధ్యయనం-38 10:14 -21
వినడం చాలా ప్రాముఖ్యం
మీరంతా బాగున్నారా? “దేవుని వాక్యం చాలా బాగుంది” అని కొందరు అంటూ ఉన్నారు. కానీ
ఎందుకు బాగుంది? ఏ విషయంలో మీకు వ్యక్తిగతంగా మేలు చేస్తుందో, అది చెప్పలేకపోతే అది
నిజమైన ఒప్పుదల కాదు. “వింటున్న మాటలన్నీ నా కోసమే అనిపించింది” అని మరి కొందరు
అంటారు. మరి ఏమాట, ఏ విషయంలో నీ కోసమే అనిపించింది అని ప్రశ్నిస్తే, చెప్పక దాటవేస్తూ
ఉంటారు. సోదరీ సోదరులారా, దేవుని వాక్యం నీలో నిజముగా పని చేసినట్లైతే, యదార్ధముగా
ఉన్నదున్నట్టు చెప్పడం నిజమైన దీనత్వమునకు గుర్తు. ఫోన్ 9866 341841 మీద మీ ప్రార్థన
మనవులు, మీకు దేవుని వాక్యం ఏ విషయంలో సహాయపడిందో ఇప్పుడే చెప్పిన హెచ్చరిక
గుర్తుంచుకొని, కాస్త స్పష్టంగా, విపులంగా, యధార్ధంగా పంచుకొనండి. ఈ ఫోన్ లో WhatsApp కూడా
ఉన్నది.
వినికిడి శక్తి దేవుడనుగ్రహించిన గొప్పవరం. నేర్చుకోవడానికి అది సహాయపడుతుంది. అన్ని
శబ్దములను విస్మరించి కొన్నిటిని మాత్రమే మనము వినవచ్చు. రోమా 10:14-21 వినడము యొక్క
ప్రాముఖ్యతను తెలుపుతుంది. చదవడం చేతకాని వారందరికీ వినడం చాలా ప్రాముఖ్యం. రోమా
10:14-21.
14 వారు
విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
15 ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో
సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
16 అయినను అందరు సువార్తకు
లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
17 కాగా వినుట వలన
విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
18 అయినను నేను
చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా?వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు
భూదిగంతములవరకును బయలువెళ్లెను.
19 మరియు నేను
చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?జనము
కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును.
అని మొదట మోషే చెప్పుచున్నాడు.
20 మరియు యెషయా తెగించి నన్ను
వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
21 ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు
చాచితిని అని చెప్పుచున్నాడు.
వినడం ఎంత ప్రాముఖ్యమో, దానికి ఆపో. ఇచ్చే కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
నేర్చుకోవడానికి వినడం ఖచ్చితమైన అవసరత. దీన్ని ఆపో. కొన్ని ప్రశ్నలచేత తెలియచెబుతున్నాడు.
14 వ వచనములో దాని అవసరత కనిపిస్తున్నది. “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన
చేయుదురు?” ఒక వ్యక్తి నమ్మాలంటే మొదటిగా తెలుసుకొని ఉండాలి. రెండవ ప్రశ్న లేవదీస్తున్నాడు.
“విననివానిని ఎట్లు విశ్వసించుదురు?” మనము వెంటే కానీ తెలుసుకోలేము. ఆ తరువాత మరో ప్రశ్న:
“ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” ఎవరో ఒకరు చెప్తే కానీ వినలేరు. 15 వ వచనములో
మరో ప్రశ్న: “ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు?” ప్రకటించేవారు పంపబడాలి.
ఈ ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. వీటిని విపులంగా ధ్యానిద్దాం. “విశ్వసింపనివానికి ఎట్లు
ప్రార్థన చేయుదురు? విననివానిని
ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ
వారెట్లు విందురు?
ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు?” వినడం యొక్క ప్రాముఖ్యతలో మొదటి
కారణం వినడం పెద్ద అవసరత. ఆపోస్థలుని ఉద్దేశ్యం ఏమిటంటే, బోధకునిమీద దీవెన ఉంటుంది. బోధ
కులు అందరికీ వినిపించాలనే భారం కలిగిఉంటారు. అందుకోసం నేనుకూడా ఈ నిరీక్షణ సందేశముతో
మీవద్దకు వచ్చాను. బోధకులు మంచి వార్త తీసుకొస్తారు. ప్రస్తుతం నేను మీకదించేది మంచి వార్త,
సువార్త. మీరు వినవాలసిన శుభవార్తను తీసుకొచ్చాను. వినడం అత్యవసరమనే విషయమును మీరు
గమనించారా, శ్రోతలూ??
రెండవది, ప్రతిస్పందన కలిగితే అప్పుడది ఆత్మీయ సత్యమవుతుంది. విన్న తరువాత విధేయత
చూపాలి. ఆపో. యెషయా గ్రంధo నుండి ఉటంకించి ఈ ప్రశ్నను చూపిస్తున్నాడు. “ప్రభువా, మేము
తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను?” ఇది చాలా ప్రముఖ్యమైన ప్రశ్న. సత్యమును గూర్చిన
సమాచారము విన్నతరువాత ప్రతిస్పందిస్తే అప్పుడే వినడం ఒక ఆత్మీయ అనుభవముగా
మారుతుంది. గమనిస్తున్నారా, శ్రోతలూ?
వినడం తరువాత వచ్చేది విశ్వాసము. 17వ వచనం దీన్ని సమీక్షిస్తుంది. “వినుట వలన విశ్వాసము
కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.” మరి క్రీస్తును గూర్చిన మాట ఎక్కడ
దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంధం బైబిలే దేవుని వాక్యం. ఎన్ని సార్లు ఈ సత్యం చెప్పినా మళ్ళీ
చెప్పాల్సిఉంటుంది. బైబిల్ దేవుని గ్రంధం, దేవుని మాట. ఇక్కడ ఆపో. పౌలు దేవుని వాక్యమును
వినడం వలన విశ్వాసము కలుగుతుందని స్పష్టపరుస్తున్నాడు. ఇంకా ముందుకు పోతే, ఆయన సృష్టి
ద్వారా లోకమo తటకి దేవుని వాక్యం వెళ్ళిందని తేటపరుస్తున్నాడు. “వారి స్వరము
భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.” 18వ వచనం. కాబట్టి
దేవుడు బైబిల్ గ్రంధం ద్వారానే కాకుండా తన సృష్టి ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. అవును, ప్రియ
సోదరి సోదారులారా, వినడం చాలా ప్రాముఖ్యం ఎందుకనగా అది ఆత్మీయ అనుభవం. వినడం
ఆత్మీయ అనుభవముగా మా రేదెప్పుడంటే, వినడము తరువాత విధేయత చూపినపుడే!
మూడవది, సత్యమును ఎదుర్కున్నపుడు, వినడం ఒక తీవ్రమైన బాధ్యత అవుతుంది.
గమనించండి, శ్రోతలూ, తెలుసుకోవడంతో పని అయిపోలేదు. ఆపో. పౌలు ఇశ్రాయేలు లోని ప్రాచీన
కాలపు ఉదాహరణ వాడుతున్నాడు. ద్వితీ. 32:21 దేవుని పక్షంగా మోషే మాట్లాడుతున్నమాటలివి.
“జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును అవివేక జనమువలన వారికి కోపము
పుట్టింతును.” సోదరీ సోదరులారా, తెలుసుకోవడం వల్ల కలిగేది తీవ్రమైన బాధ్యత. తెలుసుకోవడంతో
సరిపెట్టుకోలేము. దాని తరువాత ప్రతిస్పందన చేయాలి. ఆపో. పౌలు యెషయ నుండి
ఉటంకిస్తున్నాడు. 65:1 నుండి “ నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని
నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని
జనముతో చెప్పుచున్నాను.” ఎవరు తెరచిన హృదయముతో ఉన్నారో వారు కనుక్కున్నారు, ఎవరి
హృదయములు మూయబడిఉన్నాయో వారు పొగుట్టుకున్నారు.
ప్రభువును వెదకని వారు ఆయనను కనుక్కుoటారని యెషయా ముందే ప్రవచించాడు. దాని అర్ధం
ఏమిటంటే, ఇశ్రాయేలునకున్నట్టు దేవుని వద్దనుండి సందేశము వినే ఆధిక్యత ఇతరులకు
లేకపోయినా, ప్రభువు వారిని చేర్చుకున్నాడు. ఈ విషయం 21వ వచనం తేటపరుస్తుంది. “ఇశ్రాయేలు
విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని
చెప్పుచున్నాడు.”
ప్రియ సోదరీ, సోదారులారా, ఈ విషయమును క్షుణ్ణంగా తెలుసుకొనండి. వినడం చాలా గొప్ప
బాధ్యత అని మనం తెలుసుకోవాలి. ప్రతిస్పందన చేస్తే తప్ప ఏదీ పొందలేము. వినడం ద్వారా మనము
తెలుసుకుంటాం కదా! మనము తెలుసుకున్నదానికి, విన్నదానికి ఒక తీవ్రమైన బాధ్యత ఉన్నది.
తెలుసుకొని, విని ఊరుకుంటే సరిపోదు, క్రియ వాటి తరువాత చేయాలి.
దేవుడు వినడానికి మనకు చెవులనిచ్చాడు. వినడం మూడు కారణాలను బట్టి ముఖ్యమైనది.
వినడంఒక అవసరత. విని విధేయత చూపినపుడు అది ఆత్మీయ అనుభవముగా మారుతుంది.
దేవునితెలుసుకోవడం ఒక తీవ్రమైన బాధ్యత. అందుకే యేసు క్రీస్తు ప్రభువు పలుమార్లు, “వినుటకు
చెవులు గల వాడు వినుగాక!” అని హెచ్చరించాడు. వినుటకు, విధేయత చూపుటకు మనందరికీ
ప్రభువు కృప అనుగ్రహించుగాక! ఆమెన్!!
No comments:
Post a Comment