2వ కొరింధీ-9 1~15-22 మొదటి భాగము క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మొదటి భాగము

 

2వ కొరింధీ-9  1~15-22 మొదటి భాగము   

క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మొదటి భాగము

         జ్ఞానవంతుడైన ఒక గొప్ప నాయకుడు అన్న మాటలు ఇవి: జాగ్రత్తగా గమనించండి. “నేను 

చాలా కాలం జీవించాను. ఎంత ఎక్కువ కాలం జీవిస్తే, అంత బలంగా గ్రహిస్తున్న సత్యము 

ఒకటుంది. అదేమిటంటే, మానవుల క్రియలన్నిటి మీద దేవుని సర్వాధికారము ఉన్నది. 

ఆయనకు తెలియకుండా ఒక పిచ్చుక నేలరాలనప్పుడు ఆయన సహాయము లేకుండా ఒక 

రాజ్యమెలా ఏర్పడుతుంది?” జాగ్రత్తగా విన్నారా? కాబట్టి అన్నివిషయముల గూర్చి దేవునికి 

ప్రార్థన చేయమని ఆయన అందరిని హెచ్చరించాడు.

         ప్రణాళికలు, వ్యూహాలు ఏర్పాటు చేసిన తరువాత, అవి నెరవేరకుండా పోయినప్పుడు, 

వాటిని చేసినవారిని విమర్శించడం, తప్పుపట్టడం కుటుంబాల్లో సంఘాల్లో స్నేహితులమధ్యలో 

వ్యాపారాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి నిర్ణయాలు సమయానికి తీసుకోలేదని కావచ్చు, 

కష్టపడి పనిచేయలేదని కావచ్చు. శ్రధ్ధ లేదని కావచ్చు. కాని, పూర్వాపరాలు, అసలైన కారణాలు 

తెలుసుకోకుండా ఆ విధంగా స్పందించడం జ్ఞానయుక్తమైనది కాదు. ఆ ప్రణాళికలు, వ్యూహాలు 

నెరవేర్చకపోవడానికి ఆ వ్యక్తికి నిజమైనవి, బలమైనవి, సరియైన కారణాలు ఉండవచ్చు.

         ఈ దినపు లేఖనభాగములో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. II కొరింథీ 1:15-22. ఈ 

లేఖనభాగములో పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, ఈనాడు మనకు నేర్పుతున్న సత్యం 

ఏమిటంటే, క్రీస్తులో స్థిరపడి వేరుపారే మార్గాలు, పధ్ధతులు. అది ఈనాటి మన 

ధ్యానాంశం.       

         మొదటి మార్గం, పధ్ధతి, దేవుని ప్రణాళికలను అంగీకరించడం. దీనికి 

ముందు పౌలు 10వ వచనములో దేవుడు ఆయనను మరణాపాయములో నుండి ఎలా 

తప్పించాడో పంచుకున్నాడు. ఆయన ధైర్యoగా మంచి మనస్సాక్షితో పరిశుద్ధమైన ప్రవర్తనతో 

నిష్కపటంగా కొరింధీ సంఘముతో ఎలా జీవించాడో సాక్షమిచ్చిన సంగతి మనకు తెలుసు. 

ఆయన తప్పించబడడానికి కొరింధీ సంఘస్తుల విజ్ఞాపన ప్రార్ధనలు ఎంతో ఉపకరించాయి. 

సంఘముతో ఆయన సంభాషణ, ప్రవర్తన, మాట, పలుకు యధార్ధంగా సత్యమైనవిగా ఉన్నట్టు 

కూడా తెలుసుకున్నాం. 15,16 వచనాల్లో పౌలు వాళ్ళను మళ్ళీ దర్శించాలని ఆశపడుతున్నట్టు 

తెలుస్తున్నది. ఈ ప్రజలను ఆయన బాగా తెలుసుకొని ప్రేమిస్తున్నాడు. ఇక్కడి సంఘమును 

ఆయన స్థాపించాడు. అక్కడి సంఘస్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకున్నాడు. 

ఆ సంబంధాలను పటిష్టపరచి బలపరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ సంఘం 

ఎదుర్కుంటున్న కొన్ని సవాళ్ళు ఆయనకు తెలుసు. ఒక జ్ఞానయుక్తమైన నాయకునిగా ఆ 

సమస్యల విషయం వారితో మాట్లాడాలనే ఉద్దేశముతో వారిని దర్శించాలని ప్రణాళిక 

వేసుకున్నాడు.

         ఆయన ఎఫెసు నుండి మాసిదొనియా వెళ్ళేటప్పుడు మధ్యలో కొరింధు లో ఆగాలని 

అనుకున్నాడు. తిరుగు ప్రయాణములో కూడా అక్కడ ఆగి, వారు ఆయనను యెరూషలేమునకు 

సాగనంపుతారని ఆశ పడ్డాడు. దీన్ని పౌలు “రెండవ కృపావరము” అని పిలుస్తున్నాడు. ఆ 

ప్రణాళిక ఎందుకు మారిందో మనకు తెలియదు. కానీ కొరింధు లో ఉన్న వ్యతిరేక పార్టీ ఆయనను 

తప్పుపట్టింది. వదరుబోతు అని, మాటమార్చేవాడని, నిలుకడలేని వాడని దుయ్యబట్టింది. కాని, 

పౌలు జీవితములోని ఇతర సమయాల్లో ఆయన ప్రవర్తనలో, ప్రణాళికల్లో దేవుని మనసును 

చిత్తమును బట్టి మలచుకున్నట్టు అర్థమవుతుంది. ఈ నింద నిలుకడలేని నింద. ఇది వీగిపొయే 

అభియోగము. అ. కా. 16లో చూస్తే, అక్కడ పౌలు సీలలు చిన్న ఆసియాలో సువార్తసేవ చేయాలని 

అనుకున్నారు, కాని పరిశుధ్ద్ధాత్ముడు వారిని అడ్డగించాడు. అదే సమయములో పౌలు 

దర్శనములో మాసిదొనియా వ్యక్తి తనను పిలుస్తున్నట్టు చూచాడు. దేవుడు ఆయనను 

నడిపిస్తున్నట్టు తెలుసుకున్నాడు. కాబట్టి వెంటనే అక్కడికి బయలుదేరాడు. ఇది ప్రణాలికలో 

పెద్ద మార్పు. కాని పౌలు పిరికివాడైకాదు. నిలుకడలేకకాదు, బాధ్యతలేని వ్యక్తికాదు.


        ఈ అభియోగానికి, పౌలు కఠినంగా జవాబిస్తున్నాడు. 17వ వచనం మధ్యలోనుండి 

గమనించండి: అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా 

యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?”   ఏదో అయోమయమైన మానసిక 

అనిశ్చితిలో తాను లేనని స్పష్టంగా చెబుతున్నాడు. కొరింధు సంఘస్తులకు తాను దేవుని 

మనసును తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా ప్రణాళిక వేసుకుంటున్నట్టు సాక్షమిస్తున్నాడు. 

మీరు, నేను మన నిర్ణయాలలో తీర్మానాలలో ఈ విధంగా ప్రవర్తించాలని ప్రభువు మనలను 

హెచ్చరిస్తున్నాడు. కాని అప్పుడప్పుడు మన తీర్మానాలు సరైనవి కాకపోవచ్చు. మరికొన్ని 

సమయాల్లో ప్రభువు మన ప్రణాళికలను మార్చవచ్చు. అన్నిటికి సిద్ధంగా ఉండడం, దేవుని 

యెదుట, తోటివిశ్వాసుల యెదుట నిజమైన దీనమనసు. మీరైనా, నేనైనా, దేవుని చిత్తానుసారంగా, 

దేవుని వాక్యపువెలుగులో సరైన నిర్ణయం తీసుకున్నామని నిర్ధారణగా తెలుసుకున్నాక, దాని 

విషయం ఇతరులు నిందించినా, దూషించినా, అభియోగాలు మోపినా, మనలను మనం 

సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఓపిగ్గా ఉండడం, తీర్పులు దేవుని వదిలేపెట్టడం 

నేర్చుకోవాలి. ఇది కూడా దేవుని యెదుట, మానవుల యెదుట దీనమనసుకు ఋజువు. ఈలాటి 

పరిస్థితుల్లో ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవడానికి దేవుని నుండి 

జ్ఞానం అవసరం.

         దేవుడు తన ప్రణాళిక మార్చుకున్నపుడు ఏమి చేస్తున్నట్టు? ఎప్పుడైనా మీరు దీని విషయం 

ఆలోచించారా? దేవుని వాక్యప్రకారం నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్న తరువాత, అవి జరగక 

పోవడం గమనించాను. “ఇదెందుకు జరగలేదు ప్రభువా?” అని అడిగిన సందర్భాలు ఎన్నో 

ఉన్నవి. కొన్ని సార్లు కారణం తెలిసింది, మరికొన్ని సార్లు కారణం తెలియలేదు. దేవుని 

ఊహించలేని, అనంతమైన జ్ఞానమును నమ్మి మౌనంగా ఉండడం నేర్చుకుంటున్నాను. 

మీరుకూడా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను.

         కొరింధులోని ఆ కొందరి లాగా మనము ఉండకూడదు. పౌలు, చెప్పిన మాట ప్రకారం 

చేయనందుకు వారు ఆయన ప్రవర్తనను విమర్శించారు. తూలనాడారు, నిందించారు. జాగ్రత్తగా 

గమనించండి శ్రోతలూ! మనము మన ప్రణాళికలు, ఉద్దేశాలు మార్చుకున్నపుడు ఇతరులు ఏ 

విధంగా అర్ధం చేసుకోవాలని ఆశపడతామో అలాగే ఇతరులు మార్చుకున్నపుడు మనము ఓపిగ్గా 

ఉండి, అర్ధం చేసుకుందాం. దీని వల్ల ఏమి జరుగుతుందో తెలుసా? ఈ విధంగా రూపాంతరం 

చెంది దేవుని ప్రణాళికల ప్రకారం నడుచుకోవడానికి మనము నిర్ణయం తీసుకున్నపుడు, మనము 

క్రీస్తు నందు వేరుపారి స్థిరపడతాం. ఆ విధంగా రూపాంతరం చెందడానికి, పరిశుద్ధ 

పరచబడడానికి ఇది ఒక మార్గం పద్ధతి. సామెతల గ్రంధంలోని లేఖన భాగం ఈ సత్యానికి ఎంత 

దగ్గరగా ఉందో గమనించారా?నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు 

ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” సామెతలు 3:6


         క్రీస్తులో నా ప్రియ సోదరీ, సోదరులారా, భక్తి, అంటే బైబిల్ చదివి ప్రార్థన చేయడం కాదు. 

హృదయములో మార్పు కలగడం. అది ఎవరు చేయగలరు? దేవుడు ఒక్కడే! పరిశుధ్ద్ధాత్ముని 

శక్తిచేత. దేవుని వాక్యములోని శక్తి చేత. కాని, మీరు నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 

మాత్రమే జరుగుతుంది. విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన, రాసుకున్నంత మాత్రాన 

జరగదు. వినాలి, చదవాలి, రాసుకోవాలి. కాని అక్కడ ఆగిపోకూడదు. అసలైన అడుగు వేయడానికి 

ధైర్యం చేయండి. తగ్గించుకోండి. ఎవరిని క్షమాపణ అడగాలో వారిని అడగడానికి వెనుకాడకండి. 

ఎవరినైనా కించపరచి తూలనాడి, అవమానించారో, వారితో సమాధాన పడడానికి నడుము కట్టండి. 

అడుగు వేయండి. తగ్గించుకునేవారు హెచ్చింపబడతారని మీకు తెలుసు. యేసు క్రీస్తును 

తిరస్కరిస్తున్న ప్రియ స్నేహితులారా, ఇవన్నీ నీ జీవితములో నీవు రుచి చూడాలనుకుంటే, మొట్ట 

మొదటి మెట్టు నీవు, నేను పాపులమని, దేవుని తీర్పు ఇప్పటికే మనమీద ఉన్నదని లేఖనం 

స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు

విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక 

వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.”  యోహాను 3:18. నీ మీద ఉన్న దేవుని తీర్పును, 

శిక్షను కొట్టివేసినవాడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయనను నీ రక్షకునిగా నీవు విశ్వసించితే, ఆయనే 

నీ హృదయములో మహాగొప్ప మార్పు కలిగిస్తాడు. నీవు చేయవలసిందల్లా ఒక్కటే! మనస్ఫూర్తిగా, 

హృదయపూర్వకంగా యేసు ప్రభువును నీ పాపములు క్షమించమని వేడుకో, పరిశుద్ధ గ్రంధం 

బైబిల్ కావాలనుకుంటే, మీ మనవి మాకు తెలియచేయండి. 


ప్రార్థన: మీకు తోచిన మాటలతో, యధార్ధ మైన మాటల తో ప్రార్ధన చేయండి !

2వ కొరింధీ-10 1~15-22 రెండవ భాగము - క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? రెండవ భాగము

https://drive.google.com/file/d/17gI5_8KWZOe7Uf0zKhrGiVeUGHTi-IHv/view?usp=sharing

 

2వ కొరింధీ-10  1~15-22 రెండవ భాగము  

క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం?

రెండవ భాగము

ప్రియ శ్రోతలందరికి యేసు క్రీస్తు ద్వారా కృపాసమాధానములు కలుగుగాక! క్రీస్తులో వేరుపారి స్థిరపడడానికి మార్గాలు అనే శీర్షికన రెండవ అధ్యయనం చేస్తున్నాము. ఈ శీర్షికలోని మొదటి భాగమును ఇంతకు ముందు తెలుసుకున్నాము. దేవుని అధికారానికి మన ప్రవర్తన, నిర్ణయాలు, తీర్మానాలు, ప్రణాళికలు అప్పగించుకోవడమని తెలుసుకున్నాము. పౌలు జీవితములోని ఉదాహరణను స్పష్టంగా వివరించుకున్నాము.

         క్రీస్తులో వేరుపారి స్థిరపదాలనుకుంటే రెండవ మార్గము, పద్ధతి, దేవుని వాగ్దానములద్వారా.

లేఖన భాగo II కొరింధీ 1:15-22. మీ బైబిల్ తెరిచి జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను.

పౌలు తనను సమర్ధించుకోవడానికి యేసు క్రీస్తు మాదిరిని ఉదహరిస్తున్నాడు. పౌలు తన జీవితమంతటిని, ఆయన వ్యక్తిత్వాన్ని యేసుక్రీస్తును సేవించడానికి, ఆయనను ప్రకటించి ప్రదర్శించడానికి, అర్పణగా ఇచ్చాడు. ఆయన “నిన్న నేడు ఒకేరీతిగా ఉన్నవాడు.”  నిజాయితీ లేదని, నిలుకడలేదని పౌలు మీద వారు మోపిన అభియోగాలు ఆధారాలు, రుజువులు లేని పనికిమాలినవి. యేసు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడు “అవును” అని చెప్పే “అమెన్” అనువాడు. ఆయన శిష్యులు పౌలు, తిమోతి సిల్వాను కూడా ప్రభువులాగే అవునంటే అవును కాదంటే కాదని నోటితో చెప్పడమే కాకుండా ఆ రీతిగా ప్రవర్తించినవారు. ఏది మనసులో ఉందే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు! రెండు మాటల మధ్యలో అటుఇటు ఊగిసలాడలేదు. హల్లెలూయ!! మన ప్రభువు యేసు క్రీస్తు స్వయానా బోధించిన పరమసత్యము మత్తయి సువార్త 5:37లో ఎంత స్పష్టంగా నిర్ద్వంద్వంగా బోధించారో చూడండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.”  చివరి మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో గమనించారా? చాలా మండి క్రైస్తవులని, విశ్వాసులమని, దేవుని సేవకులమని చెప్పుకునేవారు కూడా వారి మాటను ఎంతో సులభంగా మార్చుతూ ఉంటారు. ఇది దేవుని పిల్లల లక్షణం కాదని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మీ ప్రవర్తన మార్చుకుంటే దేవుని మెప్పు పొందుతారని వేరే చెప్పనవసరం లేదు.

         యేసు క్రీస్తును ఆ రకమైన అనిశ్చిత రీతిగా కొరింధీ విశ్వాసులు రుచి చూడలేదని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు పలికిన మాటలు ఏమిటి? “నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును...”   ఈ మాటలు ప్రభువు జీవితములో ప్రవర్తనలో నిరూపించాడు. తన విషయం లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చాడు. పాపులమైన మనలను విమోచించడానికి తన క్రియలు సమాప్తం చేశాడు. ప్రభువే సిలువ మీద మరణించక పోయి ఉంటే మన పాపములు, వాటి శిక్ష, తీర్పులను, నిత్య నరకం సంగతి ఏమై ఉండేదో, మనమేమైపోయో వారమో ఒక్కసారి ఆలోచించండి. ఆయన పిల్లలమని చెప్పుకునే మనము మన మాట ప్రకారం చేయడం, నిలబడడం, ఎంత అత్యవసరమో గమనిస్తున్నారా? 20వ వచనము గమనించండి: దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.”  ఈ మాటల అర్ధమేమిటి? దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము నిజమయ్యేది, నెరవేరేది తండ్రిఅయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తులోనే! ఈ ఒక్క వాక్యములో సువార్త అంతా ఇమిడి ఉన్నది.

         ఆదిమ సంఘములోని సమావేశాల్లో చెప్పబడిన సిధ్ద్ధాంతము ఎంత సత్యవంతమైనదో సాక్షమివ్వడానికి అందరూ కలిసి “అమెన్” అని చెప్పడం ఆనవాయితీ అని మనకు తెలుసు. ఎవరికి అపోస్తలుడైన పౌలు సువార్తను అందించాడో, వారిలో కొందరు,  ఆయననే అనుమానించడం, అపోహలు పెట్టుకోవడం, నిందించి అభియోగాలు మోపడం విడ్డూరంగా లేదూ? “అమెన్” అనే మాటను ఎవరు పరిచయం చేశారో, ఆ మాటను ఎలా వాడాలో బోధించిన ఆయననే వారు తప్పుపట్టడం చాలా దుఃఖకరమైన స్థితి. నిలుకడ లేదనే సంగతి నిజమే అయితే అది కొరింధీ సంఘపు వారిలో ఉన్నది కాని పౌలులో లేదు.

         అవును, ప్రియ సోదరీ సోదరులారా, దేవుని వాగ్దానములు మనలను క్రీస్తులో స్థిరపరుస్తాయి. అపోస్తలుడు పేతురు తన రెండవ పత్రికలో పలికిన మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను

         మన విశ్వాసము అమూల్యమైనదని మనము జాగ్రత్తగా జ్ఞాపకముంచుకోవాలి. “ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,” అనే మాటలలో ఎంత పరిపూర్ణత ఉందో మనమందరము గమనించాలి. శక్తి మన శక్తి కాదు, మానవశక్తి కాదు, రాజకీయ నాయకుల అధికారము కాదు, అది దేవుని అపరిమితమైన ఊహించలేని అద్భుతమైన శక్తి. కావలసినవన్ని ప్రభువు ఇచ్చాడు. ఇస్తాడు కాదు. మరొకటి అమూల్యమైనది ఉన్నది. అవి దేవుని వాగ్దానములు. అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు” దేవుని వాగ్దానములద్వారా మనకేమి లభిస్తుంది? లోకమందున్న బ్రష్టత్వమును తప్పించుకోగల శక్తిని పొందుతాము. బ్రష్టత్వానికి మూలము దురాశ. దీనంతటిద్వారా కలిగేది ఏమిటి? మనము దేవ స్వభావము అనగా దేవుని స్వభావమును పొందుతాము. II పేతురు 1:2-4 వరకు కంఠస్థం చేసి మనసులో భద్రము చేసుకొని ధ్యానిస్తే ఎంత శక్తి మనమంతా పొందుతాము కదూ!

         కొరింధు లో పౌలు పరిచర్య ద్వారా, దేవుని వాగ్దానములన్నిటికి యేసు క్రీస్తు ప్రభువు “ఆమెన్” అని చెబుతూ నెరవేర్చే శక్తిమంతుడని బోధించాడు. దీని ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. దేవుని వాగ్దానాలన్ని, అనగా గతము, ప్రస్తుతము, భవిష్యత్తు కోసం ఇవ్వబడిన ప్రతి వాగ్దానము శరీరధారి అయిన దైవకుమారుడు యేసు క్రీస్తులో మన కన్నులకు కనిపించే ఋజువు.

         దేవుని వాగ్దానముల “ఆమెన్” అయిన యేసు క్రీస్తు ప్రభువును నీవు రుచి చూశావా? జీవితములో ప్రతి దినం జరిగే వాటన్నిటిలో నీవు వాటి నెరవేర్పు గమనిస్తున్నావా? దేవుని వాగ్దానములు నీలో నెరవేరి, కనిపించి నిజమయ్యే దినములు ఉన్నాయా? ఈ విధంగా దేవుని నమ్మకమైన స్థిరమైన వాగ్దానములు, వాటి నిశ్చయత్వం ద్వారా ఎంతైనా నమ్మదగినవి. వీటి ద్వారా మనము క్రీస్తులో వేరుపారి స్థిరపడతాము. ప్రియ సోదరీ, సోదరులారా, దేవుని వాగ్దానములను నీవు నమ్ముతున్నావా? కొన్నిటిని కంఠస్థం చేశావా? దేవుని వాగ్దానముల ద్వారా నీ విశ్వాసము బలపడుతుందా? నేను వ్యక్తిగతంగా దేవుని నమ్మకత్వాన్ని రుచి చూశాను. నీవు రుచి చూశావా?

         ప్రియ స్నేహితుడా, యేసు క్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధం లేకపోతే దేవుని వాగ్దానములు ఒక్కటికూడా నీకు వర్తించవు, ప్రాప్తించవు. ఇంత అద్భుతమైన దేవుని శక్తి గలిగిన వాగ్దానములు నీకు వ్యక్తిగతంగా కావాలంటే, యేసు క్రీస్తును నీ పాపమునుండి విడిపించమని నీవు ప్రార్థించాలి. ప్రభువు నీ పాపములు శుద్ధిచేసి, నీలో జీవించాలి. అంతవరకు యేసు క్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధము లేదు. దేవుని వాగ్దానములు నీవికావు. ఇంత శ్రేష్టమైన అవకాశం జారవిడుచుకోవద్దని నిన్ను ప్రేమతో బతిమాలుతున్నాము. మీకు ఆత్మీయమైన సహాయము, ప్రార్ధన, కావాలంటే ఫోన్ చేయండి, లేదా ఉత్తరం వ్రాయండి. మెసేజ్ చేయండి. మీకు బైబిల్ కావాలంటే మీ మనవి తెలియచేయండి.  

ప్రార్ధన: 

    

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...