I కొరింథీ అధ్యయనం-34 10:23-33 "నైతికమైన నిర్ణయాలు ఎలా చేయగలం?" 2వ భాగం

 I కొరింథీ అధ్యయనం-34   10:23-33

నైతికమైన నిర్ణయాలు ఎలా చేయగలం? 2వ భాగం

“సజీవ నిరీక్షణ” క్రమంగా వింటున్నవారందరికీ వందనములు, శుభములు! మీరెలా ఉన్నారు? ఒక ఉత్తరం లేదా మెస్సెజ్, వాట్సప్ ద్వారా, మీ ప్రార్థన మనవులు, బైబిల్ అధ్యయనాల ద్వారా, మీరు పొందిన హెచ్చరిక, మేలు, మార్పులు, సవివరంగా తెలియచేయండి. ఉత్తరాలు రాసే యుగము గతించిపోయిందనుకుంటున్నారా? మనమిప్పుడు ధ్యానిస్తున్న I కోరింథీ పత్రిక, దీనికి ముందు ధ్యానించిన రోమా పత్రిక ఉత్తరాలు కదా! ప్రభువు తన వాక్యమును వ్రాయించి ఉంచినందుకు మనకెంత మేలు కలుగుతున్నది గమనిస్తున్నారా? ఉత్తరాలు వ్రాయాలనుకునే వారు మెస్సెజ్ లో అడ్రసు అడిగినట్లయితే మెస్సెజ్ లో తెలియచేస్తాము.  
    పోయిన వారములో నైతికమైన నిర్ణయాలు ఎలా చేయగలము అనే అంశములోని మొదటి ఆధారమును క్షుణ్ణంగా అధ్యయనం చేశాము. ఈ పూట మిగిలిన రెండిటినీ నేర్చుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చిప్రశాంతంగా కూర్చోండి, ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే మన కేంద్రం.
     

      నైతిక నిర్ణయాలు చేయడానికి కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంధములో ఉన్నాయి. మొదటిది, దేవునికి తోటి వారికి అనుకూలత, సౌలభ్యం, అనే ఆధారమును గతములో తెలుసుకున్నాం కదా! స్వార్ధముతో కాదు. మనకేది మంచిది అని కాదు, ఇతరులకు ఏది మేలుకరమైనది, అది మనము ఆలోచించవలసిన ఆధారం. దేవుని రాజ్యము కట్టబడ్డానికి, మన తోటి సహోదరులు, సహోదరిలు కట్టబడ్డానికి ఏది అనుకూలమో దానికి తగ్గట్టుగా మన నిర్ణయాలు ఉండాలి.
         రెండవ ఆధారము, మన మనస్సాక్షి అనే ఆధారం.  I కోరింథీ 10: 25-30 వచనాలు మీ బైబిల్లో గమనించండి. “25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. 26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. 27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించినది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 29. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల? 30. నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?”  
    మనకందరికీ మనస్సాక్షి ఉన్నది. దేవుడే మనకనుగ్రహించిన వరo మనస్సాక్షి. దేవుడు ఆ విధంగా మనలను సృష్టించాడు. మనకు పుట్టుకతోనే మనస్సాక్షి కలిగింది. అంతేకాదు, మన మనస్సాక్షికి మనము నేర్పించుకోవచ్చు. ఆ విధంగా నేర్పించినపుడు అదే మనస్సాక్షి మనకు చాలా విషయాల్లో మనతో మాట్లాడుతుంది. కానీ మనకు ఒక ప్రామాణికత, ఒక నడిపించే నాయకుడు అవసరం. పౌలు మాట్లాడుతున్నది ఒక మార్కెట్ గురించి. ఆయన ఇస్తున్న ఉపదేశమేమిటి? మీరు మార్కెట్ లోనికి వెళ్ళి ఏది కొనుక్కుంటారో అది నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఎవరైనా ఇది విగ్రహాలకు అర్పించబడింది, అని చెబితే అతని మనస్సాక్షి కోసం, మీ మనస్సాక్షి కోసం మానేయండి. ఎందుకంటే అది మాంసపు మార్కెట్.
    ఈనాటి తరం “నా” అని చెప్పే తరం. అంతా నాయిష్టం వచ్చినట్టు చేసుకుంటా, నా ఇష్టం  వచ్చినప్పుడు చేస్తా,  నా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తా, నాకు నచ్చినట్టుగా పాడుకుంటా, ఇలా అన్నీ “నా” అనే వాటికి కేంద్రబిందువుగా జరిగించుకునే పతనమైపోయిన యుగమిది. కానీ దేవుని పరిశుద్ధ గ్రంధం ఏమి సెలవిస్తుంది? “నేను కాను, క్రీస్తే”. కొందరు ఆదివారాన్ని తమ స్వంతపనులు చేసుకోవడానికి,  వారింటిలో రిపేర్ పనులు, కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. కొందరు ప్రభువు దినాన్న పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. ఇది సరియైనదేనా? మీ మనస్సాక్షి ఏమని చెబుతుంది? మిమ్మల్ని గద్దించడం లేదా? ప్రభువు దినము అన్నప్పుడు అది ప్రభువు దినమే! నీది నాది కాదు. ఆదివారం మంచి దినం, ప్రయాణం ఈ దినం ఆరంభించుదామని చెప్పేవారున్నారు. మంచి దినం, చెడు దినమని దేనినీ అనడానికి మనకు హక్కులు లేవు. ప్రభువు చేసిన అన్ని దినాలు మంచివే, అన్ని దినాలలో ప్రభువు సర్వాధికారపు కృపలు మనతో ఉంటాయి. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు, ఆయన చేసిన నిబంధనకు మనము కట్టుబడి ఉన్నామా? లేదా?
    మనము మన మనస్సాక్షి చేత కాదు, ఇతరుల మనస్సాక్షి చేత అదుపు చేయబడుతున్నాము. నీవైదనా సేవిస్తున్నపుడు, ఒక వ్యక్తి ‘అది విగ్రహాలకు అర్పించబడింది’ అని నీతో చెబితే, ఆ వ్యక్తి మనస్సాక్షి కోసం నీవు మానేయాలి. అంటే ఎవరి మనస్సాక్షి కోసం నీవు ఆలోచన కలిగిఉండాలి? నీతో చెప్పిన వ్యక్తి మనస్సాక్షి విషయం. జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ?  “తీర్పు తీర్చబడనేల?”  “దూషింప బడనేల?”  అనే ఈ మాటలను జాగ్రతగా అలకించండి. మన నిర్ణయాలు నైతికమైనవిగా ఉండాలంటే వాటి వలన, మనకు ఇతరుల తీర్పులు, దూషణలు కలుగకూడదు. అవి కలుగకుండా ఉండే విధంగా మన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది అతి జాగ్రతగా జ్ఞాపకముంచుకోవలసిన సత్యము. ఇతరులు పడిపోకుండా ఉండడానికి మీరు, నేను ఒక కారణము కాకూడదు. బలహీనమైన కాళ్ళకు మనము అడ్డు బండలు వేయకూడదు. ప్రియ సోదరుడా, సోదరీ, ఒక్క సారి ఆలోచించండి, మన ప్రభువు యేసు క్రీస్తు నీ కోసం నా కోసం ఆలోచించకుండా ఉంటే, ఆయన మానవుడుగా వచ్చేవాడు కాదు, అప్పుడు మనకు, రక్షణ, పాప క్షమాపణ, నిత్యత్వపు నిరీక్షణ ఏమీ ఉండవు. ప్రభువు యేసు క్రీస్తులవారికి మన ఎల్లప్పుడు గురించిన ఆలోచనలే! హల్లెలూయ! మరి నీవు నీ సోదరీ, సోదరులకోసం ఆలోచించవా?  
    ఇక మూడవ ఆధారము. నిబధ్ద్ధత, సమర్పణ అనే ఆధారం.  31-33 వచనాలు చదువుకుందాం. “31. కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. 32. యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి. 33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.”  నా ప్రియమైన స్నేహితులారా, మీరు క్రైస్తవ విశ్వాసులైనా, కాకపోయినా, మన జీవితాలు దేవునితో ముడిబడి ఉన్నాయి. సమస్తమైన వారిపైన ఆయనకు అధికారమున్నది. ఒక క్రైస్తవ విశ్వాసి తప్పు, పాపము చేసినందుచేత ఎందరు యేసు క్రీస్తు రక్షకుణ్ణి, ప్రభువు సిలువను తిరస్కరిస్తున్నారో గదా? ఈ విషయం మీకు బాగా తెలుసు. “పాస్టర్ గారూ, నన్ను ఆ గుంపులో కలుపుతున్నారా?” అని మీరనుకునే తలంపులు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. నేను ఎవరిని ఏమీ అనడంలేదుగాని, ఎవరిని వారు పరీక్షించుకోమని ప్రేమతో బ్రతిమాలుతున్నాను. నీవు నేను నిజమైన క్రీస్తు శిష్యులమైతే, ఆయనను సంతోషపెట్టడమే మన పని. అప్పుడే నేను చెప్పే ఈ మాటలు మీకు ఒక బండరాయిలాగా కాకుండా, ఇష్టపూర్వకంగా ఉంటాయి. మన చుట్టూ ఉన్నవారికి అభ్యంతరం, బాధ, శ్రమ, దుఖం కలిగించకుండా జీవించాలి. ముఖ్యంగా దేవుని సంఘములోని వారికి బాధ, దుఖం, అభ్యంతరము కలిగించకూడదు.  అనగా ఆపో. పౌలు ఎఫెసీ, 5:15లో బోధించినట్టుగా జ్ఞానముతో, జాగ్రతగా నడుచుకోవాలి. చీకటిలో, గుంతలుండే త్రోవలో, కొండప్రాంతాల్లో ఇతరులకిచ్చే సలహా ఏమిటి? ‘చూసి నడవండి, ‘చూసి అడు గేయండి’ అవును, చుట్టూ చూసి జాగ్రతగా ఇతరులకు బాధ దుఖము, అనుమానము, అవిశ్వాసము కలిగించకుండే రీతిగా మాటలు, క్రియలు, ప్రవర్తన, జీవన విధానము ఉండేలా జాగ్రత పడదాం. ఎందుకు? మన గురి చేరడానికి. మన కేంద్రీయ గురి, ఆశయం, అనేకులు రక్షించబడాలి. 33వ వచనములో ఆపో. పౌలు స్వంత సాక్ష్యం వింటున్నారా? “ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.”   ప్రభువునందు ప్రియులారా, మన గురి ఏమిటి? మంచి పేరు సంపాదించుకోవడమా? పదవి సంపాదించు కోవడమా? మనకీ గురి, ఆశయం, ఆకాంక్ష ఉంటే, మనము కూడా ఆయన లాగా మార్పు చెందుతాo. అప్పుడు దానికి తగ్గట్టుగా మన నిర్ణయాలు తీసుకుంటాము.
    ఒక భక్తుని హెచ్చరిక మాటలు, ఈ విషయములో చాలా భావముతో నిండిఉన్నాయి. మనము చేసే ప్రతి ఒక్క పని, మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుని పట్ల భయముతో, మన రక్షకునిపట్ల ప్రేమతో మన నిర్ణయాలను చక్కటి ఆదరణకరమైన పద్ధతిలో ఎల్లప్పుడు స్థిరమైన పద్ధతి తప్పకుండా, చేయడానికి పూనుకుందాము. మాటలతో స్తుతి ఆరాధన చెల్లించడం కాదు, ఆలాంటి జీవితమును దేవునికి స్తుతి యాగముగా అర్పించుదాము.  విధవరాలిచ్చిన రెండు కాసులు, శిష్యుడని ఒక సహోదరునికి మనమిచ్చే గిన్నెడు చన్నీళ్ళు ఈలాటి పనులు నిష్కపటమైన ప్రేమతో, త్యాగపూర్తితమైన మనసుతో చేద్దాం. ఇవి ఆపో. పౌలు సముద్రాలు దాటి, అతి కఠినమైన కష్టం, శ్రమ, హింస భరించి ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన దానితో దేవుడు సమానంగా చూస్తాడు. మరి నీవు చేయడానికి సిద్ధమా? మార్టిన్ లూథర్ అతి కిరాతకమైన లౌకిక శక్తులతో పొరాడి, ధైర్యముతో నరకపు శక్తులతో తలపడి పోరాడినట్టుగా మన అనుదిన జీవితములో, మన కుటుంబములో, నీవిప్పుడు ఉన్న చిన్న సంఘములో, నీ ప్రక్కలో ఉన్న సహోదరుని, సహోదరిని నీవు ప్రేమించడం ఎంతో గొప్ప దీవనకరమైన, ప్రభువు మెచ్చే పరిచర్య. అది ఎక్కడో లేదు, నీ ప్రక్కలోనే ఉన్నది.
    నైతికమైన నిర్ణయాలు ఎలా తీసుకోగలము? అనే అంశమును ఒక్క సారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకముంచుకొనండి, మనము నైతికమైన జీవులము. మనము చేసే ప్రతి ఒక్క నిర్ణయం మేలైనా, కీడైనా, ఏదో ఒకటి కలిగిస్తుంది. మీ నిర్ణయాలు ఇతరులకు మేలు చేస్తున్నాయా, కీడు, దుఖము బాధ కలిగిస్తున్నాయా?  నైతికమైన నిర్ణయాలు చేయాలంటే ఈ మూడు ఆధారాలు మన హృదయాల్లో నాటుకోవాలి.
1.    దేవునికి, ఇతరులకు అనుకూలమైనదా? కాదా? అనే ఆధారము. సమంజసమా, కాదా? ఇతరులకు మేలు కరమా, కీడుకరమా? నైతికమైనదా, కాదా? అనే ఆధారమును బట్టి ఆలోచించాలి. 

2.    మనస్సాక్షి అనే ఆధారము. కేవలం మన మనస్సాక్షి మాత్రమే కాదు, ఇతరుల మనస్సాక్షిని బాధ పెడుతున్నామా? వారి విశ్వాసమును బలహీనపరుస్తున్నామా? అడ్డుబండగా ఉన్నామా?
3.    నిబధ్ద్ధత, సమర్పణ అనే ఆధారము. మన గురి, అనేకులు క్రీస్తు రక్షకుణ్ణి స్వీకరించాలి, ఆయన సిలువ ప్రేమను రుచి చూడాలి. రక్షించబడాలి, నిత్య నరకమును తప్పించుకోవాలి.
ప్రార్థన:

I కొరింథీ అధ్యయనం-33 10:23-33 నైతికమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

 

 I కొరింథీ అధ్యయనం-33   10:23-33

నైతికమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

 

   మీలో ప్రతి ఒక్కరికీ యేసయ్య మహిమగలిగిన నామములో వందనములు! మీలో ప్రతి ఒక్కరి కోసం ప్రతి శుక్రవారము విజ్ఞాపన ప్రార్థన చేస్తూఉన్నాము. మీ ప్రార్థన మనవి మాకు స్పష్టంగా తెలియచేయండి. ఉత్తరంద్వారానైనా, మెస్సెజ్ ద్వారగాని, వాట్సప్ ద్వారగాని, మీకు వీలైన పద్ధతిలో మీ ప్రార్థన మనవి, దేవుని వాక్యము మీలో తెస్తున్న మార్పు సాక్ష్యం తెలియచేయండి. ఈ బైబిల్ అధ్యయనాలు మీ జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో, సాక్ష్యరూపకంగా తెలియచేయండి. ఈరోజు మనమంతా కలిసి ధ్యానించే I కోరింథీ అధ్యయనం మనకందరికీ మేలుకరంగా ఉండేటట్టు ప్రార్థన చేసుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి.

    మానవుని అతి అద్భుతమైన వరములలో ఆలోచనాశక్తి, మేధాశక్తి గొప్పవి. సృష్టిలోని ఇతర జీవములకు ఈ శక్తిలేదు. కొన్నింటిని తర్ఫీదు చేయవచ్చు, కానీ వాటికి సృజనాత్మకత, చొరవ ఉండవు. ఈ శక్తి వల్ల మనము తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. మనకు ఆదేశాలు అవసరం. స్వాభావికంగా ప్రతి నిర్ణయముతో నైతికమైన ఫలితాలు ముడిబడిఉంటాయి. దాని నుండి మనము తప్పించుకోలేము. ప్రియ శ్రోతలూ, మనము నైతిక జీవాలమని చెప్పక తప్పదు. అందుచేత మనకు సహాయం అవసరం. మరి ఎవరివైపు చూద్దాం? మన చుట్టూ ఉన్న ప్రజలు, శక్తులవైపా? మీ ప్రశ్నలకు మీ చుట్టూ ఉన్న ప్రజలు ఇచ్చే ఆదేశాలు, సలహాలవైపు చూస్తారా? ఆచారలవైపా? ఎక్కడికి వెళ్తాము?
    మనకు సరియైన ఆదేశాలు కావాలంటే మార్పులేని ప్రామాణికం కావాలి. అదే మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధగ్రంధం బైబిల్. గమనించండి, బైబిల్ ఎన్నడూ, మారదు. మన తాత, ముత్తాతలనుండి ఏ మార్పు లేకుండా ఉన్నది పరిశుధ్ద్ధగ్రంధం. కానీ సమస్య ఏమిటో తెలుసా, శ్రోతలూ? చాలమందికి పరిశుద్ధగ్రంధం ఏమి ఆదేశాలిస్తుందో తెలియదు. దాన్ని క్షుణ్ణంగా చదవరు. ఒకవేళ తెలిసినా, ఆ సత్యములను నిర్లక్ష్యం చేస్తారు, లెక్క చేయరు. లేదా, వాళ్ళ ప్రవర్తనకు, నిర్ణయాలకు తగ్గట్టుగా పరిశుద్ధగ్రంధపు ఆదేశాలను మలచుకునే ప్రయత్నము చేస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్ బోధించే ఆదేశాలకు సరిగ్గా వ్యతిరేకంగా వారి ప్రవర్తన నిర్ణయాలు ఉంటాయి. అంచేత, ఈ దినమున ఆపో. పౌలు I కోరింథీ 10:23-33 వచనాల్లో ఇచ్చే హెచ్చరికలు అధ్యయనం చేసి “నైతికమైన నిర్ణయాలు ఎలా చేయాలి?” అనే ప్రాముఖ్యమైన అంశమును కూలంకషంగా అధ్యయనం చేద్దాం.
    ఈ లేఖన భాగములో నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆపో. పౌలు కొన్ని ఆధారాలు ఉపదేశించాడు. వాటిలో మొదటిది, సౌలభ్యం, అనుకూలం అనే ఆధారం. 23, 24 వచనాలు గమనించండి:  

“23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”  “చేయదగినవి” అనే మాటకు సరి యైనది, లేదా సమాజసమైనది అని అర్ధం. అందుకే సౌలభ్యం, లేదా అనుకూలమైనది అనే మాటను వాడుకుంటున్నాము. నైతికమైన నిర్ణయాలు చేసే సమయములో “అనుకూలమైనవా?” అనే ప్రశ్న కలుగుతుంది. దేనికి అనుకూలం? మనకు అనుకూలం కాదు. ఆపోస్థలుని ఆలోచన ఏమిటంటే, స్వాతంత్రమున్నంత మాత్రాన, కొన్ని అనుకూలమైనవి, సరియైనవి, సమoజసమైనవి కావు. చట్టబద్ధవైనంత మాత్రాన నైతికమైనవి కావు. కొన్ని క్రియలు, న్యాయబద్ధమైనవి కావచ్చు, చట్టం అంగీకరించవచ్చు, కానీ అవి నైతికమైనవి కావు. ఉదాహరణలు ఎన్నోన్నో ఉన్నాయి. చిన్న ఉదాహరణలు చూపాలంటే, ప్రభుత్వము మద్యపు దుకాణాలను ప్రోత్సహించినంత మాత్రాన, నైతికంగా, మద్యపానం సరైనది కాదు.
    మరో ప్రశ్న మీకు. సరైనది చేయడం ఎప్పుడైనా తప్పవుతుందా? ముఖ్యమైన మాట. మనము చేయగలిగినవన్నీ చేయనవసరం లేదు. ఉదాహరణకు, సైతాను యేసు క్రీస్తు రక్షకుణ్ణి దేవాలయపు శిఖరము మీదికి తీసుకొనివెళ్ళి, ‘నీ పాదములకు రాయి తగలకుండా నిన్నుకాపాడాలని  దేవుడు తన  దూతలకు ఆజ్ఞాపించాడు, గనుక దుంకమని చెప్పాడు.’ కానీ ప్రభువు దుంకలేదు. ప్రభువునకు దుంకడo సాధ్యమే, ఆయనను తండ్రి రక్షించేవాడు. యేసయ్య సముద్రం మీద నడిచాడు. మన ప్రభువు తాను చేయగలిగినవన్నీ చేయలేదు. మనము కూడా మనము చేయగలిగినవన్నీ చేయనవసరం లేదు. దానికి బదులుగా ఇతరులకు సహాయం చేయడానికి మనసును మళ్లించుదాం. కట్టలేకపోయినా, కనీసం ఆ సహోదరుని సాక్ష్యమును, వ్యక్తిత్వమును కూలగొట్టకండి. 24వ వచనములో దేవుని పరిశుద్ధాత్ముడు ఏమని హెచ్చరిస్తున్నాడో, గమనించండి: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”  అంతేకాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనే మూలసత్యమును మరిచిపోకండి. 26వ వచనములో ఉన్నట్టుగా, సర్వ  భూమి, ఇందులోని సర్వము, సమస్తము, ఆయనవే అని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి, మనము నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మొదటిదిగా ఆలోచించవలసింది, అనుకూలమైనది ఏమిటి? ఎదుటి వారికి మేలుకరమైనది ఏమిటి? ఒక బైబిల్ పండితుడు ఏమని హెచ్చరిస్తున్నాడో, తెలుసుకుందామా? శ్రోతలూ, జాగ్రతగా వింటున్నారా? ఒక వ్యక్తి, అనగా నీవు నేను, లోకము రక్షించబడాలని, మనుషులు యేసయ్యవైపు మళ్లాలని ఆకాంక్షను హృదయములో
ఉంచుకున్నట్లయితే, తమ ప్రవర్తనను దానికి తగ్గట్టుగా మలచుకుంటారు. ప్రతి చిన్న విషయములో మన ప్రవర్తనను ఆదేశించే మాటలు ఉండకపోవచ్చు, కానీ ఈ ఉద్దేశానికి తగ్గట్టుగా వేసుకునే బట్టలు, డబ్బు ఖర్చు పెట్టే పద్ధతి, జీవన విధానం, వినోదం కలిగించడానికి ఏ ఏ మార్గాలను ఎంచు కుంటారు, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకములో మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ అన్నింటినీ, ఆ ఉద్దేశం కోసం మార్చుకుంటారు. ఫలానా విషయములో ఏమని వ్రాయబడింది అని వ్రేలు పెట్టి చూపించే వాక్యము ఉండకపోవచ్చు, ఈ వేషం, ఈ భాష, చివరకు ఈ కుర్చీ, సోఫా అవసరమా? మన దేవుడు మనకిచ్చిన చట్టము ప్రకారము పరీక్షిస్తే ఇది సమంజసమా, సరైనదా, ఈలాంటి రీతిగా ఆలో చించడం అవసరం. మన దృష్టికి అది సబబే అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది ఇష్టమేనా? లేదా దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన పద్ధతిలో మన జీవిత విధానముందా? ఇతరుల మేలు కోరుతున్నామా, మన మేలు మాత్రమే ఆలోచిస్తున్నామా? ప్రభువు దృష్టిలో అనవసరమైనవి, అవివేకమైనవి ద్రోహకరమైనవాటిని చేస్తున్నామా? దేవుని రాజ్యపు ఉద్దేశానికి విరుధ్ధంగా మనము జీవిస్తున్నమేమో? మన జీవితాలు, ముగించక ముందే, పరీక్షించుకుంటే మంచిది. ప్రభువు మహా కృప మనకందరికీ తోడుగా ఉండుగాక! అమెన్!!  

I కొరింథీ అధ్యయనం-32 10:16-22 ~రెండవ భాగం~(2)ప్రభువు బల్ల దగ్గర కలుసుకోవడం


 

I కొరింథీ అధ్యయనం-32   10:16-22

~రెండవ భాగం~ ప్రభువు బల్ల దగ్గర కలుసుకోవడం

గతించిన ఆదివారము, ఈ దినము ప్రభువు బల్లలో పాలుపొందారా? కొందరికిది అలవాటు కావచ్చు, మరికొందరికిది 

ఆచారము కావచ్చు. కొందరు కేవలం బల్లలో మాత్రము పాలు పొంది ఆరాధనలోనుండి వెళ్లిపోతూఉంటారు. మనమెలా 

అర్ధం చేసుకొనేది ముఖ్యం కాదు, ప్రియులారా, దేవుని సజీవమైన లేఖనము ఏమని బోధిస్తున్నది? అది 

ప్రాముఖ్యమైనది. గతించిన పాఠములో ఉదహరించిన మూడు లేఖన భాగములను మీరు చదివారా? ఈ పూట ఈ 

లేఖన  భాగముల ఆధారంగా పౌలు బోధనననుసరించి కొన్ని ధ్యానాంశములను నేర్చుకుందాం. 

         మొదటి ధ్యానాంశము: చొప్పించి చేర్చబడడం. I కోరింథీ 10:16-17 వచనాలు: 16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు  రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? 17. మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము”  ఇక్కడ కుటుంబమనే భావన మీకు కనిపిస్తుందా? “మనం దీవించు ఆశీర్వచనపు పాత్ర” అనే మాటలు పస్కా పండుగ సమయములో కుటుంబములోని వారందరూ ఒక్క చోట చేరి ఆ భోజనములో పాలు పొందుతారుకదా! నిర్గమ కాండము 12వ అధ్యాయములో మీరు జాగ్రతగా గమనించినట్లయితే, యూదుల సమాజములో కుటుంబపు వారందరూ చేరుతారు. అదివారు సాయంకాలము చేస్తూ ఉంటారు.

         అలాగే ప్రభువు బల్లలో పాలు పొందేటపుడు  క్రీస్తు రక్తము దేవుని కుటుంబములో మనలను ఐక్య పరుస్తుంది. “పాలు పుచ్చుకొనుట” అనగా చాలా దగ్గరి సంబంధం. అనగా దీని ద్వారా క్రీస్తు రక్తములో మనము భాగము పొందుతున్నట్లే! గింజలు అన్ని కలిసి ఒక్క రొట్టెగా ఏర్పడ్డట్టే, మనము యేసు ప్రభువునందు ఒక్కటిగా ఉంటాము. ఆ రొట్టెలో ఎన్నో గింజలు కలిసిపోయినట్టు మనమంతా ప్రభువులో కలిసిపోవాలి.  గింజలు ఒక్క రొట్టెగా మారినట్టే మనము ప్రభువులో ఒక్క శరీరములాగా ఉంటాము. కాబట్టి మన మొదటి ధ్యానంశము చొప్పించబడి, కలిసిఉండి దగ్గర చేర్చబడం. ఒక బల్లవద్ద కుటుంబపు వారందరూ కలిసి భోజనం చేసినట్లే, మనము ప్రభువు బల్లదగ్గర కలిసిపోతాము. ఒక ప్రఖ్యాత బైబిల్ పండితుడు ఏమని దీని విషయం బోధిస్తున్నాడో గమనించండి: గింజలు ఒక్కొక్కటి కలిసిపోయి పిండిగా మార్చబడి, దానినుండి ఒక్క రొట్టెగా చేయబడ్డప్పుడు గింజలు వేరు వేరు కావు గాని ఒక్కటే!

గోధుమ గింజలన్నీ కలిస్తీ కాని ఒక రొట్టె తయారుకాదుకదా! ఆ రొట్టెలో మనమంతా భాగము తీసుకున్నపుడు మనమంతా ఒక్కటిగా ఉంటాము. వేరు వేరు వ్యక్తులమైనా ప్రభువునందు ఒక్క కుటుంబముగా కలిసి ఐకమత్యంగా ఉండాలి. మనము ఒక్క రొట్టెలో భాగము తీసుకుంటున్నాము కాబట్టి మనమంతా ఒక్కటే! ప్రపంచములోని ఏ దేశములో చూసినా కలిసి ప్రభువు బల్లలో పాలుపొందడం ఐక్యతను, స్నేహభావమును సూచిస్తుంది.

         పౌలు బోధనలోని రెండవ ధ్యానాంశం, చొరబడం. 18-20 వచనాలు గమనించండి: 18. శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 19. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 20. లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. ఇక్కడ ఆపో. పౌలు బలిపీఠం మీది బల్యర్పణ విషయం కాస్త ధృడంగా మాట్లాడడం గమనిస్తున్నాము. ఈ బలిపీఠం అక్కడ సేవ చేయడానికి నియమించబడ్డ వారికి చెందినది మాత్రమే. ఇశ్రాయేలు చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బలిపీఠం వద్ద సేవ చేయడానికి కొందరు మాత్రమే దేవుని చట్టం ద్వారా నియమించబడ్డారు. బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి యాజక వంశమైన లేవీ గోత్రానికి చెందిన లేవీయులకు మాత్రమే దేవుడు అధికారమిచ్చాడు. ఇశ్రాయేలీయుల రాజులలో ఒకరాజు, అనగా ఉజ్జీయ బలి అర్పించడానికి పూనుకున్నపుడు, దేవుని కఠినమైన శిక్ష పొందాడు. తన జీవితాంతం కుష్టురోగిగా ఉంది, కడగా అపవిత్రంగా జీవించాడు. II దిన. 26:9. దేవుని పరిశుద్ధ బలిపీఠం దగ్గర లేవీ గోత్రీకులైన లేవీయులు తప్ప మరెవ్వరూ సేవ చేయడానికి వీలు లేదు.

         అలాగే ఇప్పుడు కూడా తిరుగుబాటు, వ్యతిరేకత చూపడానికి అనుమతి లేదు. విగ్రహారాధనకు, దానికి చెందిన వాటికి అనుమతి లేదు. అది క్రీస్తు శరీరములోనికి బలవంతంగా చొరబడడమే అవుతుంది. “సహవాసం” అనే మాటకు “పాలు పొందుట” అనే మాటకు ఒకే మాట మూలభాషలో వాడబడింది. 20వ వచనములో మనకు కనబడుతున్న “పాలివారవుట” అనే మాటకు సహవాసమని అర్ధం. ప్రభువు అతి పరిశుద్ధమైన బల్లలో విగ్రహారాధన చొరబడం ఊహించనుకూడలేనిది. మన రెండవ ధ్యానాంశం క్రీస్తు శరీరమును చెరిపేసే విగ్రహారాధన చొరబడడం. మరో సారి బైబిల్ పడితుల వివేచనను తెలుసుకుందాం. జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? వారు, లేదా మీరు, ఆరాధనలో ఐక్యపరచబడ్డారు. ఆ విధంగా భావిస్తున్నారు. అదే రీతిగా మీరు విగ్రహాలయాలలో విగ్రహారాధన చేస్తున్న వారితో కలిసిపోయి, వారి  బలి ద్రవ్యాలలో పాలు పంచుకుటుంటున్నట్లయితే, వారితో ఐక్యపరచబడిఉన్నారనే అర్ధం. వారి నీచమైన అసహ్యమైన వాటిలో మీరు పాలు పంచుకుతున్నారన్నమాటే. జాగ్రత సుమీ! దేవుని ఉగ్రతకు చోటీయకండి.

         ఇక మూడవ ధ్యానాంశం, మినహాయించడం, బహిష్కరించడం అనే తలంపు. 21-22 వచనాలు: 21. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు. 22. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?” 21వ వచనములో పౌలు ధృడంగా ఒక భేదమును ఏర్పాటు చేస్తున్నాడు. “మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు. ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.” ఇది అసాధ్యం. మత్తయి సువార్త 6:24లో యేసు ప్రభువువారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును.”  నీవు ఎవరికి చెంది ఉంటావో నిర్ణయించుకోవాలి, ప్రియ సోదరీ, సోదరుడా! “ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు” అని దేవుని పరిశుద్ధ గ్రంధం తేటపరుస్తుంది. ప్రభువు పాత్ర, ప్రభువు బల్ల దయ్యముల పాత్రను, దయ్యముల బల్లను బయట ఉంచుతుంది. ఒక విషయం నిర్మొహమాటంగా, నొక్కి చెప్పనివ్వండి, ప్రభువు దుష్టత్వమును సహించడు. ఆయనను వెంబడించే వారు, ఆయన సంఘములో ఉండేవారు, కూడా దుష్టత్వమును సహించకూడదు. మరోసారి వేదాంత ఈ మాటల గురించి పండితుని వ్యాఖ్యానం విందాం. దేవుని ప్రేమిండము నుండి మనలను దారి తొలగించే ఏవిధమైన జీవిత విధానమైనా, దయ్యముల బల్లతోనే సమానము. ఎందుకంటే అది ప్రభువు బల్లకు వ్యతిరేకమైన వాటిమీదికి మన మనసులను మళ్లిస్తున్నది. హద్దుకు మించి స్నేహితులనైనా, ఆస్తిపాస్తులనైనా, గౌరవఘనతలు ప్రేమించడమంటే, వాటిలో ఇదే విగ్రహారాధమైన స్వభావమున్నది. అది మన జీవితాల్లో జరిగితే, దేవుని ఉగ్రతక చూపకుండా ఉండడు! ఈనాడు ఈ అధ్యయనం వింటున్న మనమంతా ఈ ప్రశ్న వేసుకోవాలి. “హద్దుకు మించి వీటితో సంబంధాలు పెట్టుకొని దేవునికి రోషము పుట్టిస్తున్నామా?” వీటి వల్ల దేవునికి అసహ్యత కలిగించి, ప్రభువు ఉగ్రతకు ఎదురు పోతున్నామా?  సాధారణంగా చాలామంది క్రైస్తవ విశ్వాసులు హద్దుకు మించి ఒక స్నేహితుణ్ణి ప్రేమించినపుడు, కోపముతో ప్రభువు ఆ వ్యక్తిని తొలగిస్తాడు, లేదా ఒక ఆస్తిని ప్రేమించినట్లయితే దాన్ని అగ్నికి ఆహుతి చెయ్యొచ్చు. దేవుని విడిచిపెట్టి, ఒకవేళ లోకముతో కలిసిపోయి, దాని ఆర్భాటము, ఆట పాటలు, పాపపు పోకడలు మన జీవితాల్లో భాగమైతే, దేవుని కోపముతో ఆయన దర్శించి తన తీర్పులు పంపే అవకాశం చాలాఉన్నది. అప్పుడు మనలను ఆయన అణుస్తాడు, దానిద్వారా, పశ్చాత్తాపపడి తిరిగిరమ్మని పిలుస్తాడు. ప్రియ సోదరీ, సోదరుడా, ఈ మాటలు నా గురించే చెప్తున్నట్లుగా ఉన్నాయి, పాస్టర్ గారు, అంటున్నారా? ప్రభువు ఎదుట తగ్గించుకొని, క్షమాపణ వేడి, ఆయనతో సమాధానపడదాం, రండి ప్రార్థన చేద్దాం, మీరు నిజముగా పశ్చాత్తాపపడుతున్నట్లయితే, మీ బైబిల్ మీద చేయి వేసి ఉంచండి.

         ఈ మూడు ధ్యానాంశాలను జ్ఞాపకం చేస్తున్నాను.

1.       చొప్పించి చేర్చబడడం. మనము క్రీస్తు శరీరము, మనమంతా ఒక్కటే శరీరములోని అవయవములము.       

2.    చొరబడం. దయ్యములకర్పించిన బలులు చొరబడతాయి, జాగ్రతగా, అప్రమత్తంగా ఉండాలి.

3.    మినహాయించడం, బహిష్కరించడం. ప్రభువు బల్లలో పాలు పొందడమంటే, ప్రభువుతో సహవాసము, పాలుపంపులు పొందడం. కాబట్టి ప్రభువు పాత్రకు దయ్యముల పాత్రకు ఏ మాత్రము సహవాసముండదు. దేవుని శిక్షకు, కోపమునకు తలుపు తెరిచినట్టే.

ప్రార్థన:

 

 

 

 

 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...