I కొరింథీ అధ్యయనం-13 4:10-15
నాయకులను గౌరవించాలి
రేడియో వద్ద కూర్చొన్న ప్రతి ఒక్కరికీ మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు నామములో శుభములు,
వందనములు! ఆయన అనుగ్రహించే శాంతి, సమాధానము, నిరీక్షణ, కృప కనికరములు మీలో ప్రతి ఒక్కరూ
అనుభవించి ఆనందించాలని ప్రార్థిస్తున్నాము.
కోరింథీలో ఉన్న సంఘములో వివాదాస్పదమైన భావాలు ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి ఆపో. పౌలు
వాటిని సరిచేయాలనే బలమైన ప్రేరణ ఆయనకు కలిగింది. దీని విషయం I కోరింథీ 4:10-15 వచనాల్లో స్పష్టంగా
వ్రాయబడింది. మీ బైబిల్ తెరిచి ఉంచి, మీ నోట్ బుక్ పెన్ తో సిద్ధంగా ఉన్నారా? I కోరింథీ 4:10-16.
ఈ లేఖన భాగములో ఆపో. ఇస్తున్న హెచ్చరికలను జాగ్రత్తగా పరిశీలించి ఏ ఏ స్థాయిలలో ఈ బోధనాత్మకమైన హెచ్చరికలను ఇచ్చాడో నేర్చుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి, ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోండి.
ఈ బోధనాత్మకమైన హెచ్చరికలలో మొదటి స్థాయి పరస్పర విరుద్ధమైన పోలికలు. 10వ వచనం గమనించండి:
“మేము క్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధి మంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు;
మీరు ఘనులు, మేము ఘనహీనులము.” ఇక్కడ పౌలు “ మేము” అంటున్నప్పుడు తనతో బాటు ఈసంఘపు
నాయకులైన అపోల్లోను, పేతురును కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాడు. పౌలు కొంతమట్టుకు వ్యంగ్యంగా మాట్లాడ్డం
గమనిస్తున్నాము. అపోస్తలులు వెర్రివారు కాదని అందరికీ తెలుసు. “వెర్రివారు” అనగా తెలివిహీనులని, మెదడులో
ఆలోచనాశక్తిలేనివారని, ఆవిధమైన పనులు చేసేవారని అర్ధం. పౌలు అంటున్న మాటలకు ‘క్రీస్తు కోసం మేము
బుద్ధిహీనులము, మీరు బుద్ధికలవారు, మీకు అన్నీ తెలుసు, ప్రశ్న రాకముందే మీకు జవాబులు కూడా తెలుసు’
అంటున్నట్టు. ఇంకా ముందుకు పోయి ఆయన ‘మేము బలహీనులము, వెన్నెముక లేనివారము. తిరిగుబాటురాగానే
లొంగిపోయేవారము. బలహీనులము కాబట్టి పడిపోతున్నాము’ అంటునట్టు. “బలవంతులు” అంటే పలుకుబడి, సత్తా,
స్థాయి కలిగినవారమని అర్ధం. మీరు ఘనులు అంటే ఎంతో గౌరవించబడుతున్నవారు అని అర్ధం. మీరు గదిలోనికి
రాగానే అందరూ నిశాబ్దంగా ఉంటారు అని అర్ధం. మీరు ఘనతగల వారు, మేము త్రోసివేయబడి, లెక్కలేనివారము.
ఘనత, గౌరవం లేని వారమని పౌలు వారితో అంటున్నాడు.
బైబిల్ పండితులు ఏమంటున్నారో తెలుసుకుందామా? పౌలు లంటున్న మాటలలో వ్యంగ్యత ఉన్నది. నిజానికి
వెర్రివారుగా, బలహీనులుగా, ఘనాహీనులుగా ఉన్నది కోరింథీ సంఘములోని ప్రజలు. జ్ఞానముతో ఘనతతో
బలముతో జీవించి, శ్రమ, హింస, నింద, శత్రుబాధలు, వ్యతిరేకత ఇలాటి అన్నిటిని ఓర్చుకొని సువార్తను కోరింథీ
సంఘములోని ప్రజలు సువార్తను అందించిన అపోస్తలుడు పౌలు, ఆయనతో తోటి వారు జ్ఞానులు, బలవంతులు,
ఘనత కలిగినవారు.
పౌలు ఎంత ధైర్యంగా సువార్తను బోధించాడో ఆపో. కా. చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. మనమంతా మనకు
నిజమైన సువార్తను బోధించడానికి శ్రమిస్తున్నవారిని ఎలా ఘనపరచాలో, గౌరవించి, వారు బోధించే దేవుని వాక్యానికి
ఏ విధంగా లోబడి, విధేయత చూపాలో ఇక్కడ స్పష్టమౌతుంది. నాయకులను గౌరవించడములోని మొదటి స్థాయి
విరుద్ధమైన పోలికలు అని మనము గ్రహించవలసిన అవసరత ఉన్నది.
రెండవ స్థాయి, ప్రతికూలమైన పరిస్థితులు. అవేంటో చూద్దాo, 11-13 వచనాలు మీ బైబిల్లో గమనించండి. “11ఈ
గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన
నివాసములేక యున్నాము;౹ 12స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు
దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;౹ 13దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము
లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
మొదటిగా పౌలు భౌతికమైనవి ప్రస్తావిస్తున్నాడు. ఆకలి, దప్పిక, దిగంబరత్వమును అనుభవిస్తున్నామని చెప్పడం గమనిస్తున్నారా? ఇవి శరీరానికి కలిగే అవసరతలు, అవునా? దిగంబరత్వము అనే మాటకు బట్టలు చిరిగిపోయినవని అర్ధం. సరిపోయిననన్ని బట్టలు ఆయనకు లేవు. పిడిగుద్దులు ఎవరు తిన్నారు? మన రక్షకుడు యేసు క్రీస్తు సిలువ వేయబడకముందు రోమా సైనికులచేత పిడిగుద్దులు తిన్నారు. మన ప్రభువును అరచేత్తో కొట్టారు. ఇది ఆనాటి సమాజములో అత్యంత అవమానకరమైనది. ఆతరువాత నివాసము లేదని చెబుతున్నాడు. ఇది కూడా ప్రభువు మత్తయి. 8:20లో చెప్పిన మాటలకు దగ్గరలో ఉన్నది. “మనుష్యకుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు. మత్తయి. 8:20. ఆ తరువాత తన పని గురించిన వివరణ ఇచ్చాడు. తన స్వంత చేతులతో పనిచేసి కష్టపడుతున్నానని చెప్పడం ఎంత అమూల్యమైన విషయం. ఆయన డేరాలు కుట్టే వృతి చేసేవాడు. ఎక్కడికివెళ్లినా తన పనిచేసుకొని అవసరాలు తీర్చుకునేవాడు. ఇది గొప్పవృత్తికాదు. గౌరవప్రదమైనవృత్తికాడు. ఒంటె వెంట్రుకలతో, మేక వెంట్రుకలతో చేయబడ్డ బట్టతో డేరాలు కుట్టాలి. కానీ అది ఆదాయం కోసం చేయదగ్గ వృతి. తన స్వంత చేతులతో పనిచేశాడు.
అందుకనే ఆయనను స్వంత పని చేసుకుంటూ ప్రభువును సేవించిన సేవకుడని, మిషనరీ అని పిలుస్తూఉంటారు. ఆ తరువాత సమాజము ఆయనను ఎలా చూసిందో వివరణ ఉన్నది. నిందింపబడుతూనే దీవిస్తున్నాము అని సాక్షమిస్తున్నాడు. నిందించడమంటే, ప్రజలు ఇష్టమొచ్చినట్టు తిట్టడం. కానీ ఆయన ప్రతిస్పందన దీవించాడు. ఈ మాటలు చదువుతున్నపుడు మన రక్షకుడు కొండ మీది ప్రసంగంలో పలికిన మాటలు గుర్తుకు రావాలి. మత్తయి 5:11.12,44 వచనాలు. హింసను ఓర్చుకున్నాడు, దూషింపబడుతూనే బతిమాలుతున్నాడు. హెబ్రీ. 11:37 మీ నోట్ బుక్ లో రాసుకొని చదవండి. మరింతగా ఏమి అనుభవించాడో గ్రహించవలసిన అవసరత ఉన్నది. లోకము దృష్టిలో మేముక మురికి కుప్పలాగా, పెంటకుప్పలాగా ఉన్నామని చెప్పడం ఎంతటి దీనస్థితిని చూపిస్తుందో గమనిస్తున్నారా?
పౌలు మానసిక ఒత్తిడితో ‘డిప్రెషన్’లో ఉన్నాడనుకుంటున్నారా? కావచ్చు. ఆయన కోరింథీ సంఘములోని విశ్వాసులు, ఈ నాడు వింటున్న మనమంతా మనలను సరిదిద్దాడానికి ఈ హెచ్చరికలు దేవుని ఆత్మ శక్తితో వ్రాశాడు.
ఇక మూడవ స్థాయి అనుకూలమైన నిర్ధారణ. 14,15 వచనాలు. “మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా
ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.౹ క్రీస్తునందు మీకు ఉపదేశకులు
పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక
మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹” ఈ భాగములో
ఆయన స్వరం మారుతున్నది. ఎందుకనగా సిగ్గుపరచడానికి కాదుగాని, ప్రియులైన పిల్లలు కాబట్టి బుద్ధిచెప్పడానికి
రాస్తున్నానని ప్రేమతో లాలించడం గమనిస్తున్నాము. కోరింథీ సంఘాన్ని కించపరచాలని కాదుగాని, కాయపరచాలని
కాదుగాని, వారిని ప్రేమతో బాగుపరచాలని హెచ్చరిస్తున్నట్టుగా చెబుతున్నాడు. బుద్ధిచెప్పుట అంటే హెచ్చరించడమని
అర్ధం. దేవుని వాక్యమువల్ల ఈ నాడు మనము కూడా బుద్ధి తెచ్చుకుందాము. ఇంతవరకు జీవించిన అవివేకము,
నిర్లక్షము, బుద్ధిహీనత చాలు. దేవుని పరిశుద్ధ వాక్యమునుబట్టి బుద్ధి తెచ్చుకొని మనమెవరో, మనకు సేవ చేస్తున్న
సువార్తికులు, సంఘ కాపరులు పడుతున్న వేదనలు, యాతనలు, మీకు వాక్యం బోధిస్తున్న మాలాంటి దైవసేవకులు
ఏ స్థితిలో ఉంది మీకు సేవ చేస్తున్నారో మీరు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాము. మరో బైబిల్ పండితుడు ఏమన్నారో
తెలుసుకుందాం. ఒకరు మరొకరిని కేవలం బాధ పెట్టడానికి, కించపరచడానికి గద్దించకూడదు. అలా చేసేటప్పుడు ఆ
సహోదరుణ్ణి బాగుచేసి, ధైర్యపరిచే ఉద్దేశంతో చేయాలి. గద్దించేటపుడు ప్రేమతో, సాత్వికముతో, మెత్తని మనసుతో బాధ
పెట్టకుండా, గాయపరచకుండా సున్నితంగా చేయవలసి ఉంటుంది. గద్దింపు ఈలాంటి పద్ధతి చేసినపుడు బుద్ధి
కలుగుతుంది. మీకు పదివేలమంది బోధకులు ఉండవచ్చని పౌలు చెబుతున్నాడు. కానీ తండ్రులు ఎంతోమంది
ఉండరు. ఒక్కరే! కోరింథీ సంఘస్తులమీద తనకు ఆత్మీయ తండ్రిగా ఉన్న హక్కును వినియోగించుకుంటున్నాడు. పౌలు ఏథెన్స్ లోని మార్స్ కొండమీద ఘనులు, విద్యావంతులతో మాట్లాడినా తరువాత కోరింథీ పట్టణానికి వచ్చాడని
చెప్పాను, గుర్తుందా? ఏథెన్స్ పట్టణం విద్యావంతులు, వేదాంతవేత్తలు, మేధావులు ఉన్న పట్టణం. కోరింథీ అలాంటి
పట్టణం కాదు. పౌలు కోరింథీ పట్టణానికివచ్చి అక్కడ సువార్త బోధించి సంఘమును స్థాపించి ఏర్పాటు చేశాడు.
అందుచేత సరిగ్గానే వారికి ఆయన ఆత్మీయ తండ్రి. “ క్రీస్తుయేసునందు సువార్తద్వారా నేను మిమ్మును కంటిని” అనే
మాటలు గమనించారా? ఆయన పితృత్వం క్రీస్తునందు ఉన్నది. ఆపో. పౌలు ఎంతటి మహా దైవజనుడో
గమనిస్తున్నారా, శ్రోతలూ? మనమేస్థితోలో ఉన్నామో ఆయన మనకు చూపిస్తున్నాడు. మరొక దైవజనుడు పౌలు
గురించి బోధించిన సత్యాలు జాగ్రతగా గమనించండి. (1) తన స్వoత దేశములో ఘనత ధనము సంపాదించుకోవడానికి
గొప్ప అవకాశాలు పౌలుకున్నవి. ఉన్నతమైన విద్యను నేర్చుకున్నాడు, తన స్వంతవారియొక్క మన్ననలు చాలా
పొందాడు. ఆయనకున్న తలాంతులు ఆయనను ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచగలవు. (2) ఆయన మారుమనసు,
రక్షణ విషయములో ఎలాంటి అనుమానము లేదు. అ. కా. 9 చదవండి. ఆ దర్శనం, ఆ స్వరము, ఆ వెలుగు, ఆ
గుడ్డితనము ఏ మాత్రం మరపురానివి. అవి నకిలీవి కానేరవు. అవి అందరి యెదుట తెరచి ఉంచబడ్డ సంఘటనలు.
ఎక్కడో ఒక మూలకు అవి జరగలేదు. ఆయన రక్షకునివైపు మళ్లడానికి లౌకికమైన ప్రేరణ లేదు. ఆ దినాల్లో క్రైస్తవ్యం
నీచమైనదిగా ఎంచబడింది. ఈ మార్గాన్ని ఎంచుకున్నవారు సంఖ్యలో చూస్తే తక్కువే. వారంతా పేదవారు.
ప్రపంచమంతా వ్యాప్తి చెందే సూచన లేదు. ధనము వచ్చే అవకాశము లేదు. కిరీటాలు పొందే గొప్పదనము లేదు.
ఘనతను ఇవ్వలేదు. సుఖమును ఇవ్వనూ లేదు. దాని వల్ల గొప్పవారితో సంబంధాలు కలుగుతాయనే నమ్మకం
లేదు. క్రైస్తవ శిష్యులు శ్రమలు, కన్నీళ్లు, హింస, మరణం పొందవలసిన దినాలవి. ఆలాంటి వ్యక్తి ఈలాంటి మార్గము
ఎంచుకోవడానికి స్ఫూర్తి ఏమిటి? అందులో ఉండే సత్యము తప్ప ఆయనను ఇక ఏదీ ఆకర్షించలేదు. పౌలు చెబుతున్న
మూడవ స్థాయి అనుకూలమైన నిర్ధారణ. మీకు సువార్తను, దేవుని పరిశుద్ధ లేఖనములను బోధిస్తున్న వారిని
గౌరవించి ఘనపరచడం సంఘములలోని విశ్వాసుల బాధ్యత. వారివద్ద మీరు దేవుని వాక్యమును సువార్తను
నేర్చుకోవాలి, వారిని ఘనపరచి గౌరవించాలి. అట్టి శక్తి కృప సంఘపు శిరస్సు అయిన యేసు క్రీస్తు ప్రభువు
మనకందరికీ సర్వ సమృద్ధిగా అనుగ్రహించుగాక! అమెన్!!